Amaravati Capital Income: అమరావతి రాజధానిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ వ్యతిరేకమే. మొన్ననే అమరావతి బదులు మావిగన్ ప్రతిపాదన చేశారు జగన్మోహన్ రెడ్డి. మరోసారి రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదని చెప్పుకొచ్చారు. అంతకుముందు మూడు రాజధానులు అనే తెరపైకి తెచ్చింది కూడా ఆయనే. టోటల్ గా చెప్పాలి అంటే అమరావతికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. ఇక సాక్షి మీడియా గురించి చెప్పనవసరం లేదు. అమరావతికి వ్యతిరేకంగా పుంకాను పుంకాలుగా రాస్తూనే ఉంటుంది సాక్షి. అటువంటి మీడియాలో అమరావతికి అనుకూలంగా ఒక కథనం వచ్చింది. అమరావతి ద్వారా ప్రభుత్వం రెండు లక్షల 50 వేల కోట్ల రూపాయలు ఇప్పటికే సమకూర్చుకుంది అనేది సాక్షి కథనం సారాంశం. ఓ వ్యతిరేక కథనంలో భాగంగా ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయింది దాని సారాంశం.
* చంద్రబాబు ఇంటి పక్కనే గ్రీన్ జోన్..
అమరావతిలో చంద్రబాబు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అన్ని రకాల వసతులతో ఈ భవన నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ భవనం పక్కనే మూడు వేల గజాలకు పైగా ఖాళీ స్థలాన్ని ఉంచారు. మరో నిర్మాణం జరగకుండా ఉండేందుకు గ్రీన్ జోన్ పరిధిలో చేర్చారు అని సాక్షి మీడియా ఒక కథనం రాసుకొచ్చింది. చంద్రబాబు కుటుంబానికి మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ కథనంలో పేర్కొంది. ఈ నిర్ణయంతో సిఆర్డిఏ కు భారీగా నష్టం జరిగిందని కూడా చెప్పింది. అమరావతిలో ప్రస్తుతం గజం ధర 50వేల రూపాయలు అని.. చంద్రబాబు ఇంటి పక్కనే గ్రీన్ జోన్ పరిధిలో చేర్చడంతో 18 కోట్ల నష్టం జరిగిందన్నది ఈ కథనం సారాంశం. ఇప్పటివరకు అమరావతి అనేది అప్పుల కుప్ప అని.. దాని ద్వారా పూర్తిగా ఆదాయం రాదని తేల్చేసిన సాక్షి.. ఇప్పుడు అక్కడ గజం భూమిని 50 వేల రూపాయల రేటు కట్టిమరి అక్కడ ఉన్న విలువను చాటి చెప్పింది.
* సాక్షి కథనంలో..
సాక్షి మీడియా నిత్యం అమరావతి పై విషం చిమ్ముతూ వచ్చింది. అయితే అమరావతి రాజధానికి భూమి సమీకరించిన ప్రభుత్వం.. తన వద్దే ఓ ఐదు వేల ఎకరాలను పెట్టుకుంది. అమరావతి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందు చూపుతో ఆలోచన చేసింది. అయితే గజం ధర 50 వేల రూపాయలు పలుకుతోంది అని అదే సాక్షి చెప్పింది. ఈ లెక్కన ప్రభుత్వం వద్ద ఉన్న భూమి విలువ అక్షరాల రెండున్నర లక్షల కోట్లు. అమరావతి రాజధాని నిర్మాణానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని.. దాని ద్వారా రూపాయి ఆదాయం వచ్చే అవకాశం లేదు అని సాక్షి ఇన్నాళ్లు కథనాలు ప్రచురించింది. కానీ చంద్రబాబుపై వ్యతిరేక కథనం అల్లే క్రమంలో గజం ధర 50 వేల రూపాయలను చెప్పడం ద్వారా.. రాజధాని నిర్మాణం పూర్తి కాకముందే.. ప్రభుత్వం చేతిలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం ఉందని బయట పెట్టింది. అందుకే అంటారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి మీడియా వరమో.. శాపమో అని..!