India fighter jet deal : ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైనిక శక్తి, ఆయుధ శక్తి ప్రపంచానికి తెలిసింది. అనేక దేశాలు మన బ్రహ్మోస్ కోసం ఆసక్తి చూపుతున్నాయి. ఇక భారత్ కూడా విదేశీ ఆయుధాలపై ఆధారపడడం తగ్గించి దేశీయంగా తయారీ పెంచుతోంది. ఈ క్రమంలో రక్షణ బడ్జెట్ను కేంద్రం భారీగా పెంచింది. అయినా కొన్ని ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో అమెరికా తమ ఎఫ్–16, ఎఫ్–32 కొనాలని ఒత్తిడి చేస్తోంది. కానీ అవి ఇటీవల విఫలమయ్యాయి. ట్రంప్ ప్రభుత్వం ఈ విమానాలను అమ్మడానికి సిద్ధంగా ఉన్నా, డేటా షేరింగ్, సాంకేతిక బదిలీ విషయంలో అమెరికా నిబంధనలు భారత్కు ఆమోదయోగ్యంగా లేవు. ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లాగా ఎఫ్–35లను కొనలేమని భారత వాయుసేన చీఫ్ స్పష్టం చేశారు.
రష్యా, ఫ్రాన్స్తో చర్చలు..
సుఖోయ్–52 యుద్ధ విమానాలను ఇండియాకు ఇద్దామని రష్యా ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో 114 రఫేల్ జెట్ల కొనుగోలుకు ఫ్రాన్స్ సిద్ధంగా ఉంది. కానీ భారత్ మాత్రం ఒకే కఠిన షరతు పెట్టింది. పూర్తి డేటా, సాంకేతిక పరిజ్ఞానం, సోర్స్ కోడ్ బదిలీ చేయాలని కోరుతోంది. ప్రస్తుతం 18 రఫేల్ విమానాల ఫ్లై–అవే కండిషన్లో వెంటనే సరఫరా చేయనుంది. 96 విమానాలు భారత్లోనే తయారీ (మేక్ ఇన్ ఇండియా) చేయనుంది. ఇందులో స్వ్వదేశీ కంటెంట్ కనీసం 50–60 శాతం ఇండియన్ హార్డ్వేర్, కాంపోనెంట్స్ ఉపయోగించాలి. మొత్తం విలువ సుమారు రూ. రూ.3.25 లక్షల కోట్లు. ఈ డీల్ వచ్చే నెలలో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.
ఐసీడీ కీలక షరతు..
భారత్ ఇప్పుడు కేవలం విమానాలు కొనడమే కాకుండా వాటి తయారీలో దేశీయ పరిశ్రమలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. హార్డ్వేర్ ఇండియన్ కంటెంట్ డెవలప్మెంట్ (ఐసీడీ) కింద 3.5 లక్షల కోట్ల విలువైన ఈ మెగా డీల్ దేశీయ రక్షణ తయారీ రంగానికి ఊతమివ్వనుంది. కొత్త డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ (డీఏపీ–2026) ప్రకారం, భారత్ ఇకపై కేవలం ‘మేడ్ ఇన్ ఇండియా‘ కాకుండా, ‘ఓన్డ్ బై ఇండియా’ విధానానికి ప్రాధాన్యత ఇస్తోంది. అంటే డిజైన్, ఐపీ (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ), సోర్స్ కోడ్ పూర్తిగా భారత్ చేతిలో ఉండాలి.
భారత్ ఇకపై కేవలం ఆయుధాలు కొనే దేశంగా కాకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకునే శక్తిగా ఎదుగుతోంది. డేటా, ఐపీ, సోర్స్ కోడ్ బదిలీ లేనిదే ఎటువంటి డీల్కు సిద్ధపడని కఠిన వైఖరి అమెరికా, రష్యా వంటి దేశాలకు సందేశం ఇస్తోంది. రూ.3.5 లక్షల కోట్ల రఫేల్ డీల్ ఫైనల్ అయితే అది భారత రక్షణ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది.
