Balochistan Army Attack Pakistan: తమకు స్వాతంత్య్రం కావాలని, పాకిస్తాన్ నుంచి విభజించి ప్రత్యేక దేశంగా గుర్తించాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది ఆ దేశంలోని బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ క్రమంలో బలూచిస్థాన్ ప్రాంతంలో బీఎల్ఏ తిరుగుబాటుదారులు తరచూ జాఫర్ ఎక్స్ప్రెస్తోపాటు పోలీసులు, సైన్యంపై గెరిల్లా దాడులు చేస్తున్నారు. పదేళ్లలో జాఫర్ ఎక్స్ప్రెస్పై పదికిపైగా దాడులు జరిగాయి. ఇక వందల మంది సైనికులు బీఎల్ఏ దాడిలో మరణించారు. దాదాపు బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వం లేనట్లే. ఈ పరిస్థితిలో తాజాగా 40 గంటల్లో పాక్ ఆర్మీ, బీఎల్ఏ మధ్య జరిగిన ఘర్షణల్లో 193 మంది మరణించారు. ఇందులో రెబల్స్ 145, పోలీసులు 17, పౌరులు 31 ఉన్నారు. 12 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి.
బీఎల్ఏ తీవ్ర దాడులు..
బీఎల్ఏ రెబల్స్ 40 గంటలపాటు ఆర్మీ, పోలీస్ బలగాలపై దాడి చేశారు. అధికారుల ప్రకారం, ఈ దాడుల్లో రెబల్స్ 145, భద్రతా సిబ్బంది 17, సామాన్యులు 31 ప్రాణాలు కోల్పోయారు. పాక్ విస్తీర్ణంలో 42% ఉన్న ఈ ప్రాంతం అల్లర్లతో అట్టుడుకుతోంది. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాతోపాటు 12 చోట్ల ఈ దాడులు జరిగాయి. ఈ అల్లరులు పాక్ను ఆర్థికంగా, భద్రతాపరంగా దెబ్బతీస్తున్నాయి.
పుష్కలంగా వనరులు..
ఇదిలా ఉంటే బలూచిస్థాన్లో వనరులు (చమురు, ఖనిజాలు) పాక్ ఆదాయానికి కీలకం. తిరుగుబాటు మరింత బలపడితే దేశవ్యాప్త అస్థిరతకు దారితీస్తుంది. ఇటీవలే పాక్ ప్రభుత్వం బలూచిస్థాన్లోని ఎర్త్ మినరల్స్ను అమెరికాకు అప్పగించింది. అందకుముందు చైనాకు కూడా అనుమతి ఇచ్చింది. తద్వారా డబ్బులు సంపాదిస్తోంది. ఆర్థిక అవసరాలను కొంత తీర్చుకుంటోంది. అయితే బలూచిస్థాన్ అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదు.
బలూచ్ తిరుగుబాటుకు భారత్ కారణమని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. బీఎల్ఏకు భారత్ సహాయం అందిస్తోందని పేర్కొంటోంది. మరోవైపు ఈ అల్లర్ల ప్రభావం బలూచిస్థాన్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం వచ్చే చైనా, అమెరికా సిబ్బందిపై ప్రభావం చూసే అవకాశం ఉంది.