Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ వార్ తీవ్ర రూపం దాలుస్తోంది. గతంలో ఏ యుద్ధం కొనసాగనంత సుధీర్ఘంగా ఈ యుద్ధం జరుగుతోంది. అప్పుడప్పుడు కాస్త ఆగినట్లు అనిపించినా శక్తి పుంజుకుని మళ్లీ దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రష్యాపై విరుచుకుపడుతోంది. యుద్ధంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఏకంగా రష్యా రాజధాని మాస్కోపై డ్రోన్లదో అటాక్ చేస్తోంది. దీంతో రష్యా భద్రతా వ్యవస్థలు ఒత్తిడిలో పడ్డాయి. అదే సమయంలో ఆక్రమిత క్రిమియాకు రష్యా ప్రధాన భూభాగం నుంచి ఇంధనం, సైనిక సామగ్రి చేరకుండా ఉక్రెయిన్ అడ్డంకులు సృష్టిస్తోంది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యధిక చమురు ఉత్పత్తి చేసే దేశం అయిన రష్యాలోనే ఇంధన కొరత తీవ్రమవుతోంది.
క్రిమియా ప్రత్యామ్నాయ మార్గంపై దాడులు..
రోస్టోవ్–ఆన్–డాన్ నుంచి మారియపోల్, మెలిటోపోల్ మీదుగా క్రిమియాకు వెళ్లే ఆర్–280 హైవేను రష్యా సైన్యం కెర్చి వంతెనకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తోంది. ఉక్రెయిన్లోని 412వ నెమిసిస్ బ్రిగేడ్ (ప్రతీకార దేవత పేరుతో) ఈ మార్గాన్ని లక్ష్యంగా చేసుకుంది. అమెరికా తయారీ హార్నెట్ డ్రోన్లు, స్థానికంగా తయారైన మోర్గాన్ డ్రోన్లతో జరిపిన దాడుల తర్వాత ఈ రహదారిపై వాహనాల రాకపోకలు 70 శాతం పైగా తగ్గాయి. ట్యాంకర్లు, సైనిక వాహనాలు ఈ మార్గంలో వెళ్లడానికి భయపడుతున్నాయి.
మధ్య శ్రేణి డ్రోన్లతో దాడులు..
ఎఫ్పీ–2, బెహెమోత్ వంటి 50 నుంచి 300 కిలోమీటర్ల దూరం వరకు చేరగలిగే డ్రోన్లను ఉక్రెయిన్ విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఇవి కేవలం సరఫరా వాహనాలనే కాకుండా రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా దెబ్బతీస్తున్నాయి. గతేడాది కంటే ఈ రకమైన మధ్య శ్రేణి దాడులు 28 రెట్లు పెరిగాయని అంచనా.
చమురు శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా..
2022 ఫిబ్రవరి నుంచి 2026 ఏప్రిల్ చివరి వరకు ఉక్రెయిన్ రష్యా ఇంధన శుద్ధి కర్మాగారాలపై 158 సార్లు దాడులు చేసింది. దేశంలోని అతిపెద్ద 33 రిఫైనరీల్లో కనీసం 24 దెబ్బతిన్నాయి. ర్యాజన్, సరటోవ్ రిఫైనరీలపై దాదాపు 15 సార్లు, సిజ్రాన్పై 11వ సారి దాడి జరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 16 రిఫైనరీలు దెబ్బతిని, రోజుకు 7 లక్షల బ్యారెల్స్ శుద్ధి సామర్థ్యం తగ్గింది. రష్యా ఇంధన శుద్ధి సామర్థ్యం 2009 తర్వాత తొలిసారి అత్యల్ప స్థాయికి చేరింది. 30కి పైగా రిఫైనరీల్లో ఉత్పత్తి రోజుకు 28 లక్షల బ్యారెల్స్ కంటే ఎక్కువగా తగ్గింది. ముడి చమురు ఉత్పత్తి కూడా రోజుకు 4.6 లక్షల బ్యారెల్స్ తగ్గిందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది.
సప్లయ్ చైన్ విచ్ఛిన్నం..
ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా సైన్యం మందుగుండు, ఇంధనం, ఆహారం వంటి అవసరాల సరఫరాను నేరుగా అడ్డుకోవడంపై దృష్టి పెట్టింది. రష్యా లోపలి ప్రాంతాల్లోని ఇంధన కాన్వాయ్లు, సైనిక ట్రక్కులు, రైళ్లపై డ్రోన్ దాడులు పెంచింది. అమెరికా విశ్లేషకులు ఇలాంటి 150 దాడులను రికార్డు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇంధనం తరలిస్తున్న 20 రైళ్లను నాశనం చేసింది. రష్యా సైన్యం విజయాలు సాధిస్తున్నామని చెప్పినా, సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం కావడంతో ఆ విజయాలు ఖరీదైనవిగా మారుతున్నాయి.
