Indians leaving USA reasons: డాలర్ డ్రీమ్తో ఉన్నత చదువులు.. ఉద్యోగాల కోసం అగ్రరాజ్యం అమెరికా బాట పట్టిన భారతీయులు డొనల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక తీసుకుంటున్న చర్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే అక్కడ సెటిల్ అయినవారు సైతం అమెరికాలో ఉండలేమంటున్నారు. అమెరికాలో ’అమెరికా ఫస్ట్’ నినాదంతో కఠిన వలస నిబంధనలు అమలు చేస్తున్నారు. దీని ప్రభావంతో 54 లక్షల మంది భారతీయ–అమెరికన్లలో చాలామంది అగ్రరాజ్యాన్ని వదిలి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. తాజాగా కార్నెగీ ఎండోమెంట్ సర్వేలో 40 శాతం మంది శాశ్వత వలసకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది.
అసంతృప్తి, వలస ఆలోచనలు..
కార్నెగీ సర్వే ప్రకారం, 71 శాతం మంది ట్రంప్ పాలనపై అసంతృప్తి చెప్పగా, 58 శాతం రాజకీయ అస్థిరతను కారణంగా చెప్పారు. 54 శాతం జీవన ఖర్చులు, 41 శాతం వ్యక్తిగత భద్రత ఆందోళనలు ప్రధాన కారణాలు. ఈ భారతీయులు అమెరికా మొత్తం జనాభాలో 1.5 శాతం ఉంటారు, ఐటీ, హెల్త్కేర్ వంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తారు.
హెచ్–1బీ, విద్యార్థి వీసాల్లో భారీగా కోత..
ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక హెచ్–1బీ వీసాల్లో భారీగా కోత విధించారు. వీసా ఫీజు భారీగా పెంచారు. క్యాటో ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం హెచ్–1బీ వీసాలు 25 శాతంం తగ్గాయి, లక్ష డాలర్ల ఫీజు తర్వాత పిటిషన్లు 87 శాతం క్షీణించాయి. విద్యార్థి వీసాలు (ఎఫ్–1) 40–44 శాతం తగ్గాయి, సోషల్ మీడియా వెట్టింగ్, భద్రతా తనిఖీలు కారణం. భారత, చైనా విద్యార్థులు ఫ్రాన్స్, కెనడాల వైపు మళ్లుతున్నారు.
ఆర్థిక, సామాజిక ఇబ్బందులు..
ట్రంప్ విధానాలతో అక్రమ వలసలు తగ్గినా చట్టబద్ధ వలసలు 1.5 మిలియన్లు తగ్గాయి, 65 ఏళ్లలో అరుదైనది. ఐటీ కంపెనీలు, యూనివర్సిటీలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్యూ రీసెర్చ్ ప్రకారం 7.5 లక్షల మంది కార్మికులు కోల్పోయారు. ఆన్లైన్ విద్వేషం, వర్ణ వివక్ష పెరగడం ప్రవాసులను ఇబ్బంది పెడుతోంది.
ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు సైలెంట్గా ఉండాలని కొందురు భావిస్తున్నారు. మరికొందరు భారతీయులు కెనడా, యూరప్, ఆస్ట్రేలియాల వైపు చూస్తున్నారు. భారతీయ నిపుణులు అగ్రరాజ్యాన్ని వీడితే టెన్నాలజీ సంక్షోభం తప్పదు. ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.