Indian mango price in America: మధ్య ఆసియా ప్రాంతంలో యుద్ధం కారణంగా భారత్ పై ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుంది. దీంతో అమెరికాలోని కొన్ని వస్తువుల సేవలు భారతీయులకు ప్రియంగా మారాయి. కానీ ఈ సమయంలో భారత జాతీయ పండు అమెరికాలో సంచనలం సృష్టిస్తోంది. అక్కడివారు మామిడి పండ్లకు పడిపోయి ఎగబడి కొంటున్నారు. దీంతో భారత్ లోని మామిడి పండ్లు అమెరికాలో కిలో రూ. 1900 తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో కిలో మామిడికి రూ. 100 నుంచి రూ.200 ఉండగా.. అమెరికాలో డిమాండ్ ఎందుకు పెరిగింది? పూర్తి వివరాలు మీకోసం..
భారతీయుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న మామిడి పండ్లు ఇప్పుడు అమెరికా మార్కెట్లో కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు అమెరికాలోని కొన్ని భారతీయ కిరాణా దుకాణాల్లో మాత్రమే కనిపించిన భారత మామిడిపండ్లు, ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ చైన్ స్టోర్లలో కూడా అందుబాటులోకి రావడం విశేషం. ముఖ్యంగా అమెరికాలో అతిపెద్ద హోల్సేల్ రిటైల్ సంస్థలలో ఒకటైన Costco Wholesale స్టోర్లలో భారత మామిడిపండ్లు విక్రయించడం భారత వ్యవసాయ రంగానికి పెద్ద గుర్తింపుగా భావిస్తున్నారు.
అమెరికా మార్కెట్లో భారత మామిడిపండ్లకు పెరుగుతున్న డిమాండ్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యంగా గుజరాత్కు చెందిన ప్రసిద్ధ కేసర్ మామిడిపండ్లు అక్కడ భారీ ధరలకు అమ్ముడవుతున్నాయి. కాస్ట్కో వెబ్సైట్లో ఒక కిలో కేసర్ మామిడి ధర సుమారు 20 డాలర్లుగా నమోదైంది. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1,900కు పైగా అవుతుంది. భారత్లో సాధారణంగా రూ. 100 నుంచి రూ. 200 వరకు అందుబాటులో ఉండే మామిడి పండ్లు విదేశాల్లో విలాసవంతమైన ఫలాలుగా మారిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ విజయానికి వెనుక భారత దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా కీలక పాత్ర పోషించాయి. అమెరికాలోని సియాటిల్లో భారత కాన్సుల్ జనరల్గా పనిచేస్తున్న Prakash Gupta భారత మామిడిపండ్లను ప్రధాన అమెరికన్ రిటైల్ మార్కెట్లలో ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక కృషి చేసినట్లు వెల్లడించారు. ఆయన దీనిని ‘మామిడి దౌత్యం’గా అభివర్ణించడం ఆసక్తికరంగా మారింది. భారతీయ ఉత్పత్తులకు అమెరికన్ వినియోగదారుల్లో విశ్వాసం పెంచేందుకు ఏడాది కాలంగా నిరంతర ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారుగా కొనసాగుతోంది. ప్రపంచ మొత్తం మామిడి ఉత్పత్తిలో దాదాపు 45 నుంచి 50 శాతం వరకు భారత్ నుంచే వస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలో పండే అల్ఫోన్సో, గుజరాత్ కేసర్, ఆంధ్రప్రదేశ్ బంగినపల్లి, ఉత్తరప్రదేశ్ దసరి, లంగ్రా వంటి రకాల మామిడిపండ్లు అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాయి. రుచి, సువాసన, తీపి కారణంగా భారత మామిడి పండ్లకు విదేశాల్లో భారీ ఆదరణ లభిస్తోంది.
అమెరికాకు మామిడిపండ్ల ఎగుమతి అంత సులభమైన ప్రక్రియ కాదు. అక్కడి ఆహార భద్రతా ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి. పండ్లను ప్రత్యేక హాట్ వాటర్ ట్రీట్మెంట్, రేడియేషన్ ప్రాసెసింగ్ వంటి విధానాల ద్వారా శుద్ధి చేసిన తర్వాతే ఎగుమతికి అనుమతి ఇస్తారు. అలాగే పండ్లు చెడిపోకుండా కోల్డ్ చైన్ వ్యవస్థ ద్వారా వేగంగా రవాణా చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నదే అయినా, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఎగుమతిదారులు ముందుకు వస్తున్నారు.
