190 Nuclear Weapons Arsenal: ప్రపంచ రాజకీయాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో దేశాలు తమ సైనిక బలాన్ని భారీగా పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా అణుశక్తి దేశాలు తమ ఆయుధ సంపత్తిని వేగంగా విస్తరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (ఎస్ఐపీఆర్ఐ) సోమవారం విడుదల చేసిన తాజా నివేదిక ఈ వాస్తవాన్ని స్పష్టంగా బయటపెట్టింది. ఎస్ఐపీఆర్ఐ నివేదిక ప్రకారం, 2026 జనవరి నాటికి భారత్ వద్ద 190 అణు వార్హెడ్లు ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే 10 వార్హెడ్లు పెరిగాయి. పాకిస్తాన్ వద్ద 170 ఉన్నాయి. అంటే మన దాయాది కన్నా మన వద్ద 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయి.
దూసుకెళ్తున్న చైనా..
ఇక డ్రాగన్ కంట్రీ చైనా మాత్రం మరింత వేగంగా ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం బీజింగ్ వద్ద 620 అణు వార్హెడ్లు ఉన్నాయి, గతేడాది కంటే 20 ఎక్కువ. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు రష్యా(5,420), అమెరికా (5,042) వద్దనే ఉన్నప్పటికీ, చైనా వేగం ఇతర దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.
తొమ్మిది అణుశక్తి దేశాలు..
ప్రపంచ వ్యాప్తంగా 9 అణుశక్తి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల వద్ద12 వేలకుపైగా అణ్వాయుధాలు ఉన్నాయి. ఫ్రాన్స్ (370), యూకే (225), ఇజ్రాయెల్ (90), ఉత్తర కొరియా (60) కూడా తమ సంపత్తిని ఆధునికీకరిస్తున్నాయి.
భారత్ 5వ స్థానం..
అణు సామర్థ్యంతోపాటు సాధారణ రక్షణ ఖర్చుల్లోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. 2025లో భారత్ రక్షణ వ్యయం 92.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 8.9 శాతం ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యధిక రక్షణ వ్యయం చేసే దేశాల జాబితాలో భారత్ 5వ స్థానం సాధించింది. 2021–25 మధ్య కాలంలో ప్రపంచ రక్షణ దిగుమతుల్లో 8.2 శాతం భారత్ వాటా ఉంది. ఇది దేశం తన సైనిక అవసరాలను తీవ్రంగా పట్టించుకుంటున్నట్లు సూచిస్తోంది. ఇప్పుడు అణ్వాయుధాలు కూడా పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ తోక జాడిస్తే ఇక ప్రపంచ పటంలో కనుమరుగు కావడం ఖాయం.
వ్యూహాత్మక అవసరం..
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో భారత్ ఈ అడుగులు అనివార్యమే. ఉత్తర సరిహద్దుల్లో చైనా ఆధిపత్య ఆకాంక్షలు, పాకిస్తాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా నౌకాదళ కార్యకలాపాలు ఇవన్నీ భారత్ను బలమైన నిరుత్తర శక్తిని నిర్మించుకోవడానికి బలవంతం చేస్తున్నాయి. అయితే, కేవలం సంఖ్యల పెరుగుదల మాత్రమే సమస్య పరిష్కారం కాదు. ఆధునిక డెలివరీ సిస్టమ్లు, సాంకేతిక ఆధునికీకరణ, స్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్ భారత్) దిశగా మరింత వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో, ‘‘నో ఫస్ట్ యూజ్’’ విధానాన్ని కొనసాగిస్తూనే, నమ్మకమైన నిరోధక శక్తిని నిర్మించడం కీలకం.
ప్రపంచం మళ్లీ అణు ఆయుధాలపై ఆధారపడుతున్న ఈ కాలంలో భారత్ సమతుల్య వ్యూహంతో ముందుకు సాగాలి. రక్షణ బలోపేతం అనేది కేవలం యుద్ధ సన్నాహాలు కాదు.. శాంతిని కాపాడుకోవడానికి అవసరమైన బలమైన ఆధారం. ఈ ఎస్ఐపీఆర్ఐ నివేదిక భారత్కు ఒకేసారి గర్వకారణం. హెచ్చరిక కూడా. బలం పెంచుకోవాలి, అయితే బాధ్యతావంతంగా, దూరదృష్టితో పని చేయాలి.
