Kukatpally
Kukatpally: వారిద్దరిది ఒకే ఊరు. పైగా వరుసకు బంధువులు కూడా. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వారి వయస్సు కూడా నిండా పాతికేళ్ళే. అయితే వారు అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ ఏడో ఫేజ్ లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం సమీపంలో గొల్లవాని తిప్పకు చెందిన ఆకుల శ్యామ్(24), పోతుల జ్యోతి, (23) సమీప బంధువులు..వరుస కూడా కలవడంతో ప్రేమించుకున్నారు. శ్యాం బైబిల్ బోధన లో కోచింగ్ తీసుకుంటున్నాడు. జ్యోతి గత నెల 26న కూకట్ పల్లికి వచ్చింది.. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఒక హాస్టల్ లో ఉంటున్నది. శ్యామ్ స్నేహితుడు, భీమవరం ప్రాంతానికి చెందిన కృష్ణ కూకట్ పల్లి లో ఏడో ఫేజ్ లోని ఎల్ ఐ జీ8 లో ఒక గదిలో ఉంటున్నాడు. ఈనెల 20వ తేదీన అతడి వివాహం ఉండడంతో 9వ తారీఖు సొంత ఊరు వెళ్ళాడు. అదే గదిలో ఉంటున్న అతడి స్నేహితుడు కూడా స్వగ్రామానికి వెళ్ళాడు. అయితే ఈ నెల 12న శ్యామ్ హైదరాబాద్ వచ్చాడు.. కృష్ణ కి ఫోన్ చేస్తే.. తన గది తాళం చెవి పలానా దగ్గర ఉందంటూ చెప్పడంతో.. శ్యామ్ జ్యోతిని తీసుకుని ఆ గదిలోకి వెళ్ళాడు.
ఆత్మహత్య చేసుకున్నారు
అయితే శ్యామ్ జ్యోతితో కొద్దిరోజులు ఆ రూమ్ లో ఉన్నాడు. గతంలోనూ వీరిద్దరూ ఆ రూమ్ కి వచ్చే వారిని స్థానికులు చెబుతున్నారు. అయితే శనివారం నుంచి వీరిద్దరికి సంబంధించిన స్నేహితులు, దగ్గరి బంధువులు ఫోన్ చేస్తుంటే స్పందన లేదు. దీంతో వీరిద్దరి కోసం అంతటా గాలించారు. అయితే కృష్ణ గది నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వెనక వైపు వైపు ఉన్న స్లైడ్ కిటికీలు తెరిచి చూసేసరికి గదిలో జ్యోతి అచేతనంగా కింద పడిపోయి ఉంది. శ్యామ్ ఉరివేసుకొని కనిపించాడు. అయితే వారి ఫోన్ లలో ఉన్న నంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. అయితే ఆ గదిలో స్ట్రిప్ దొరకడంతో జ్యోతి మత్తు మాత్రలు వేసుకుందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. పైగా ఆమె నోటి నుంచి నురగ కనిపించింది. ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగి ఉంటుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించిన తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పెద్దలకు చెప్పలేక
అయితే శ్యామ్, జ్యోతి ఒకే ఊరుకు చెందినవారు కావడం, పైగా వరుసకు బంధువులు కావడం, చిన్నప్పటినుంచి కలసి చదువుకోవడంతో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. కారణాలు ఏమో తెలియదు కానీ జ్యోతి వివాహం చేసుకుంది. కొంతకాలానికే భర్త నుంచి విడాకులు తీసుకుని స్వగ్రామంలోనే ఉంటున్నది. అయితే ఉద్యోగం నిమిత్తం ఇటీవల హైదరాబాద్ కు వచ్చింది. స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం శ్యామ్ ను మర్చిపోలేక తన భర్తకు విడాకులు ఇచ్చిందని తెలుస్తోంది. పెళ్లయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగడంతో భర్త కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. జ్యోతి విడాకులు తీసుకోవడంతో కన్నవాళ్ళకు కూడా స్వగ్రామంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇది మొత్తం చక్కబడే వరకు ఆమెను హైదరాబాద్ వెళ్లాల్సిందిగా వారు సూచించినట్టు ప్రచారం జరుగుతుంది. వారు చెప్పినట్టే హైదరాబాద్ వెళ్ళగా.. అక్కడికి కూడా శ్యామ్ వెళ్లాడు. ఇద్దరు కలిసి కృష్ణ గదిలో కలిసేవారు. కృష్ణ స్వగ్రామానికి వెళ్లిన తర్వాత అతడి గదిలోనే కొద్ది రోజులపాటు ఉన్నారు. పెళ్లికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు అక్కడి ఆధారాల ప్రకారం తెలుస్తోంది. అయితే శ్యాంకోసమే విడాకులు తీసుకున్న నేపథ్యంలో తన కన్నవాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటారో లేదో అని జ్యోతి అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇది ఇద్దరి మధ్య గొడవకు దారి తీసినట్టు సమాచారం. కలిసి ఎలాగూ ఉండలేము.. కాబట్టి చనిపోదామని నిర్ణయించుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు వారి బంధువులు చెబుతున్నారు. కాగా వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వ గ్రామాలకు తరలించారు. మంగళవారం అంత్యక్రియలు జరిగాయి.