Black Magic: కోడిని కోసి.. పసుపు కుంకుమలు పోసి.. మెస్‌ ఎదుట క్షుద్రపూజలు!

జగిత్యాల– కరీంనగర్‌ రోడ్డులో ఉన్న ఓ మెస్‌ ముందు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. కొలగాని అంజయ్య అనే వ్యక్తి గతకొన్నేళ్లుగా పట్టణంలో మెస్‌ నడుపుతున్నాడు.

Written By: Raj Shekar, Updated On : May 1, 2023 5:57 pm
Follow us on

Black Magic: టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రపంచం దూసుకుపోతున్నా.. సైన్స్‌ వేగంగా అభివృద్ధి చెంది అంతరిక్షంలో అడుగిడుతున్నా.. కొన్ని మూఢనమ్మకాలు మాత్రం ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దెయ్యాలు, భూతాలు అంటూ కొందరు అంద విశ్వాసంలో నిండా మునిగి తేలుతున్నారు. క్షుద్ర పూజల పేరుతో సామాన్య ప్రజలను భయాబ్రాంతులకు గురి చేస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల పట్టణంలో క్షుద్రపూజలు స్థానికంగా కలకలం రేపాయి. ఓ మెస్‌ ముందు గతరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వింత పూజలు చేశారు. కోడిని కోసి పసుపు, కుంకుమతో పూజలు చేసిన ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

షాక్‌ అయిన యజమాని..
జగిత్యాల– కరీంనగర్‌ రోడ్డులో ఉన్న ఓ మెస్‌ ముందు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. కొలగాని అంజయ్య అనే వ్యక్తి గతకొన్నేళ్లుగా పట్టణంలో మెస్‌ నడుపుతున్నాడు. రోజు మాదిరిగానే రాత్రి మెస్‌ మూసేసి ఇంటికి వెళ్లాడు. ఉదయాన్నే మెస్‌ తిరిగి తెరిచేందుకు వచ్చిన అతను షెటర్‌ తెరిచేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో అక్కడ కనిపించిన వాటిని చూసి అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. మెస్‌ ముందు కోడిని కోసిన ఆనవాళ్లు, రక్తంతో పాటు.. పసుపు, కుంకుమ చల్లి ఉండటంతో అంజయ్య భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తనకు ప్రత్యేకంగా ఎవరూ శత్రువులు లేరని.. ప్రత్యేకంగా ఎవరిపైనా అనుమానం కూడా లేదని చెప్పాడు. ఎవరో కావాలనే తన మెస్‌ ముందు ఇదంతా చేసినట్లు మెస్‌ యజమాని అంజయ్య చెప్పుకొచ్చారు.

పది రోజుల క్రితం పాఠశాలలో..
పదిరోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోనూ క్షుద్రపూజలు కలకలం రేపాయి. బీబీనగర్‌ మండలం బట్టుగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు కొందరు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లను విద్యార్థులు గుర్తించారు. స్కూల్‌ కారిడార్‌లో .. కుంకుమ, పసుపు కుప్పులు పోసి వాటిపై కోడిగుడ్డు, నిమ్మకాయలు పెట్టి వింత పూజలు నిర్వహించారు. వాటిని చూసి గజగజా వణికిపోయిన విద్యార్థులు.. వెంటనే ఉపాధ్యాయులకు విషయం చెప్పారు. ఆ సన్నివేశం చూసి.. అటు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా భయంతో అట్నంచి అటే ఇళ్లకు వెళ్లిపోయారు.

అమావాస్య రోజు..
పాఠశాలలో క్షుద్రపూజలు చేసిన రోజు అమావాస్య కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగాయని కొందరు ఫిర్యాదులు చేయటం శోచనీయం.