Site icon OkTelugu

Kodi Katti Case: కోడికత్తి కేసులో జగన్ కు షాక్..

Kodi Katti Case
Kodi Katti Case

Kodi Katti Case: కోడికత్తి…పందేలు సమయంలో ఈ ఆయుధానికి డిమాండ్ ఉంటుంది. కానీ బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం జగన్ పై దాడి తరువాతే. గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నిందితుడు జైలుకు పరిమితమయ్యాడు. నాలుగేళ్లయినా కేసు కొలిక్కి రాలేదు. అయితే ఇందులో కుట్ర కోణం ఉందని.. మరింత లోతుగా దర్యాప్తు చేయాలని జగన్ కోర్టుకు విన్నవించిన నేపథ్యంలో.. ఆ అవసరం లేదని.. ఇందులో కుట్రం కోణం లేదని.. అదంతా డ్రామా, విచారణ వృథా ప్రయాస అంటూ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తేల్చిచెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోతుగా దర్యాప్తు చేయాలన్న జగన్ పిటీషన్ ను రద్దు చేయాలని ఎన్ఐఏ కోర్టును కోరింది.

విశాఖ ఎయిర్ పోర్టులో దాడి..
గత ఎన్నికల ముందు జగన్ విపక్ష నేతగా పాదయాత్ర చేశారు. వారం వారం ఆయన సీబీఐ కేసుల విచారణకు హాజరయ్యేవారు. విజయనగరంలో పాదయాత్ర ముగించుకొని విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ పై జనుపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదని.. ఎయిర్ పోర్టులో దాడి జరిగినందున ఎన్ఐఏతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ సానుభూతిపరుడని.. టీడీపీ నాయకుడి హోటల్ లో పనిచేసేవాడంటూ ఆరోపణలు చేశారు. ఇందులో కుట్ర కోణం ఉందని ఆరోపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ నిర్ణయించింది. అప్పటి నుంచి నిందితుడు జైలులోనే ఉన్నాడు. బెయిల్ ఇప్పించాలని రాష్ట్రపతికి నిందితుడు తల్లి కోరినా ఫలితం లేకపోయింది. అయితే ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని జగన్ వినతిపై ఎన్ఐఏ స్పందించింది. ఆ అవసరం లేదని… అసలు కుట్ర కోణమనేది లేదని.. నిందితుడు టీడీపీ సానుభూతిపరుడని తేల్చుతూ ప్రభుత్వానికి నివేదించింది. జగన్ వేసిన పిటీషన్ ను రద్దు చేయాలని కూడా కోరింది.

నాలుగేళ్లుగా పురోగతి లేక..
గత నాలుగేళ్లుగా ఈ కేసు విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ప్రజలు కూడా ఇందులో ఏం జరిగి ఉంటుందన్నదానిపై ఒక క్లారిటీకి వస్తున్నారు. గత వాయిదాలో సీఎం జగన్ తరపు న్యాయవాది రెండు పిటిషన్ లు దాఖలు చేశారు. విచారణకు రాకుండా మినహాయింపు ఇవ్వాలని ఒక పిటీషన్..కుట్ర కోణాన్ని వెలికి తీయడంలో ఎన్ఐఏ ఫెయిల్ అయిందని ఆ దిశగా విచారణ పూర్తి స్థాయిలో చేపట్టేలా ఎన్ఐఏ ను ఆదేశించాలని రెండో పిటీషన్ వేశారు. అయితే కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చేసింది. నిజానికి కుట్ర ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. అసలు జగన్ పై దాడి జరగలేదని.. జరిగినట్లుగా సానుభూతి కోసం నాటకం ఆడారని ఆరోపిస్తున్నారు. ఇదంతా బయటపడుతుందని భావించారు. కానీ ఎన్ఐఏ మాత్రం కుట్ర లేదంటోంది.

Kodi Katti Case

వైసీపీ సర్కారుకు మైనస్..
గత ఎన్నికల ముందు చాలా రకాల ఘటనలు జరిగాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, జగన్ పై కోడికత్తి దాడి వంటి కేసుల్లో పురోగతి లేకపోవడం వైసీపీ సర్కారుకు మైనస్ గా మారింది. గత ఎన్నికల్లో ఈ ఘటనలు ద్వారా వైసీపీ సానుభూతి దక్కించుకుంది. భారీ విజయానికి ఇవి కూడా దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా కేసుల దర్యాప్తులో జాప్యం చేయడం ప్రజలకు వాస్తవాలు అర్ధమవుతున్నాయి. వాటిని ఎన్నికల లబ్ధికి ఉపయోగించుకున్నారని ఎక్కువమంది నమ్ముతున్నారు. అందుకే అటకెక్కించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ ఘటనలతో ఎంత లబ్ధి చేకూరిందో.. ఈ ఎన్నికల్లో అంత మైనస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version