Site icon OkTelugu

Chandrababu Strategy: ఇన్నాళ్లకు పనిచేసిన చంద్రబాబు చతురత..

Chandrababu Strategy
Chandrababu Strategy

Chandrababu Strategy: సంక్షోభాలను, సవాళ్లను అనుకూలంగా మార్చుకుంటూ రాజకీయాలు నెరపడమే నాయకుడి లక్ష్యం. అటువంటి వాటిలో ముందుంటారు చంద్రబాబు. ఆయన పొలిటికల్ కెరీర్ ను తీసుకుంటే పూలపాన్పు మాత్రం కాదు. అడుగడుగునా సంక్షోభాలను దాటుకుంటూనే నడవగలిగారు. రాజకీయంగా నిలబడగలిగారు. తన కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశారు. గెలుపోటములను అనుభవించారు. ఎన్నో గుణపాఠాలను నేర్చుకున్నారు. అందుకే ఓటమి ఎదురైన ప్రతీసారి ధైర్యం పోగుచేసుకొని పోరాడడం చంద్రబాబు నైజం. ఆయన ఎదుగుదలకు అదే కారణం. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో వ్యూహప్రతివ్యూహాలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయతీరాల వైపు పార్టీని తీసుకెళ్లగలిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలపడమే గొప్ప అన్న తరుణంలో, సీనియర్లు వెనుకడుగు వేస్తున్నా ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను పసిగట్టి క్యాండిడేట్లను నిలబెట్టగలిగారు. గెలిపించుకోగలిగారు. పార్టీ శ్రేణులను తట్టిలేపి విజయంలో భాగస్వామ్యం కల్పించగలిగారు.

టీడీపీ నెత్తిన పాలుపోసిన వైసీపీ..
గత ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యం చెందింది. 23 స్థానాలకే పరిమితమైంది. వైసీపీ అంతులేని విజయంతో దూసుకెళ్లింది. అటు తరువాత జగన్ తన మార్కు పాలన చూపించారు. టీడీపీ తాజా మాజీ మంత్రుల నుంచి సీనియర్ల వరకూ టార్గెట్ చేసుకున్నారు. కేసులు, దాడులతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. దీంతో టీడీపీ నేతలు కొందరు సరెండర్ అయ్యారు. మరికొందరు సైలెంట్ అయ్యారు. టీడీపీ శ్రేణులు సైతం నైరాశ్యంలోకి వెళ్లిపోయాయి. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇలా అన్నిఅపజయం బాట పట్టాయి. ఇక టీడీపీ పని అయిపోయిందన్న విశ్లేషణలు సైతం వెలువడ్డాయి. అయినా సరే చంద్రబాబు మొక్కవోని దీక్షతో గట్టి పోరాటం చేశారు. శ్రేణులను తట్టి లేపారు. ఇటువంటి సమయంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీ నెత్తిన పాలుపోశాయి. మళ్లీ టీడీపీకి జవసత్వాలు వచ్చాయి.

అందర్నీ కలుపుకొని వెళితేనే…
అయితే చంద్రబాబు వ్యవహారం ‘గెడ్డ దాటితే’ అన్నట్టు ఉంటుంది. అవసరం వరకూ ఒకలా.. అవసరం తీరాక మరోలా ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. మూడు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ రెండో ప్రాధాన్యత ఓట్లతో గట్టెక్కింది. వైసీపీ సర్కారు తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న తరుణంలో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి రెండో ప్రాధాన్యత ఓట్లు వేశాయని అర్ధమవుతోంది. కానీ చంద్రబాబు మాత్రం కొన్నిరాజకీయ పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ విషయం కనీసం ప్రస్తావించలేదు. బలమైన అధికార పక్షానికి ఢీకొట్టే సమయంలో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో చంద్రబాబు ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది.

Chandrababu, JAGAN

ఇదే స్పీడ్ ను కొనసాగిస్తేనే…
చాలా రోజుల తరువాత చంద్రబాబు తన పాత మార్కును చూపించగలిగారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. చాలారోజుల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎమ్మెల్యే కోటా కింద జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రెండు నెలల ముందే కసరత్తు ప్రారంభించారు. సీనియర్ల సేవలను బాగా వినియోగించుకున్నారు. పార్టీ అనుబంధ విభాగాల సహకారం కూడా తీసుకున్నారు. వ్యూహాత్మకంగా ప్రభుత్వానికి వ్యతిరేకగా ప్రచారం చేశారు. అన్నింటికీ మించి రెండో ప్రాధాన్యత ఓట్ల విషయంలో లెఫ్ట్ పార్టీలతో అవగాహనకు వచ్చారు. ఇవన్నీ టీడీపీకి ప్లస్ అయ్యాయి. అయితే చంద్రబాబు ఇదే చతురత, ముందుచూపుతో వెళితే మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి గెలుపు పలకరించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version