HomeతెలంగాణRevanth Reddy : కేసీఆర్‌ లక్ష్యంగా పావులు.. రేవంత్‌ ఎత్తులు ఫలిస్తాయా?

Revanth Reddy : కేసీఆర్‌ లక్ష్యంగా పావులు.. రేవంత్‌ ఎత్తులు ఫలిస్తాయా?

Revanth Reddy :  తెలంగాణలో ఎన్నికలు ముగిసి ఏడాది గడిచినా.. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యద్ధం ఆగడం లేదు. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కమిషన్‌ వేవారు. తర్వాత విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపైనా విచారణ కమిషన్‌ను నియమించారు. ఇదే సమయంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగు చూసింది. వీటితో రేవంత్‌ సర్కార్‌ కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావును ఇరుకున పెట్టాలని భావిస్తోంది. అయితే ఏడాదిగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. తాజాగా ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ విదేశీ సంస్థకు చెల్లించిన రూ.56 కోట్ల వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. విచారణకు పిలిచింది. అనేక ట్విస్టుల తర్వాత కేటీఆర్‌ విచారణకు హాజరయ్యారు.

కేసీఆర్‌ కోసమే..
ఎన్నికలు జరిగి ఏడాది గడిచినా.. బీఆర్‌ఎస్‌ శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం లేదు. రేవంత్‌ ముందు తాను ప్రతిపక్షంలో కూర్చోలేకనే రావడం లేదన్న వాదన ఉంది. గతంలో కాలు విరిగిందని సాకులు చెప్పిన గులాబీ నేతలు ఇప్పుడు కేసీఆర్‌ గైర్హాజర్‌పై నోరు మెదపడం లేదు. అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్‌రావే అన్నీ చూసుకుంటున్నారు. అయితే సీఎంగా రేవంత్‌ ఉన్న నేపథ్యంలో ఆయన ఎదుట ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూర్చోవడం ఇష్టం లేకనే రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రప్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఈ ఫార్ములా కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసింది. మరోవైపు హరీశ్‌రావును కూడా కాళేశ్వరం కేసులో ఇరికించే అవకాశం ఉంది. ఈ చర్యలతో అయినా కేసీఆర్‌ బయటకు వస్తారని భావిస్తోంది.

తరచూ ప్రశ్నిస్తున్న సీఎం..
ఇదిలా ఉంటే కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి తరచూ ప్రశ్నిస్తున్నారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌ సూచనలు తమకు అవసరమని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని, తెలంగాణ ప్రగతికి ఆయన తెలివి ఎందుకు ఉపయోగించడం లేదని నిలదీస్తున్నారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెళ్లారు. స్వయంగా కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇక మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌కు నివాళులర్పించేందుకు ఏర్పాటుచేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి రావాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కేసీఆర్‌కు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించారు. అయినా కేసీఆర్‌ ఫామహౌస్‌ దాటలేదు.

ఇప్పటికైనా వస్తారా..
కొడుకు కేటీఆర్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉంది. హరీశ్‌రావును కూడా ఏదో ఒక కేసులో అరెస్టు చేయవచ్చన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే పార్టీ బాధ్యతలు ఎవరు చూస్తారన్న చర్చ ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో జరుగుతోంది. ఇలాంటి తరుణంలోనే కేసీఆర్‌ కూతురు కవిత నేనున్నానంటూ మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. అయితే ఢిల్లీ లిక్కర్‌ కేసులో నిందితురాలిగా ఉన్న కవిత పార్టీ బాధ్యతలు నిర్వహించడంపై పార్టీలోనే కొందరు విముఖంగా ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ ఫాంహౌస్‌ వీడతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌ రాకుంటే క్యాడర్‌ చీలిపోయే ప్రమాదం ఉంది. పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular