HomeతెలంగాణTelangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులతో భారీ బొక్క.. ఎవరికి చేటు అంటే?

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులతో భారీ బొక్క.. ఎవరికి చేటు అంటే?

Telangana Elections 2023: ఎన్నికల్లో ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల నుంచి టిక్కెట్‌ పొందిన వారితోపాటు కాస్త జన బలమున్న నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తున్నారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వెయ్యి, రెండు వేల ఓట్లతో తేడాతో గెలిచిన అభ్యర్థులూ ఉన్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు పడిన ఓట్లను చూస్తుంటే పోటాపోటీగా ఎన్నికలు జరిగే, స్వల్ప మెజార్టీతో గెలుపొందే స్థానాల్లోని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు ప్రధాన పార్టీల గుర్తులను పోలిన గుర్తులున్న స్వతంత్ర అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు పడితే విజయం చేజారే అవకాశం ఉందని అభ్యర్థుల గుండెల్లో గుబులు మొదలైంది.

పది మందికి వెయ్యికిపైగా ఓట్లు..
2018లో నల్లగొండ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య 33 మంది. వీరిలో వెయ్యికిపైగా ఓట్లు పడిన వారు పది మంది వరకు ఉన్నారు. గెలిచిన అభ్యర్థికి దక్కిన స్వల్ప మెజార్టీకి సమానంగా స్వతంత్రులు ఓట్లు పొందటం విశేషం. 500 ఓట్లు పొందిన వారు 15 మంది వరకు ఉన్నారు. వీరు పోటీలో ఉండటం వల్ల గెలుపోటములను కొంతమేర ప్రభావం చేసినట్లు తెలుస్తోంది. ఈసారి ప్రధాన పార్టీలను పోలిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించినట్లు ఆయా పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. కొందరు ఓటర్లు పార్టీల గుర్తును గమనించక.. దాన్ని పోలిన గుర్తున్న స్వతంత్రులకు ఓటేసే అవకాశం ఉందని నాయకులు గుబులు చెందుతున్నారు. దీంతో స్వతంత్రులు ఊహించిన దానికంటే కొంత ఎక్కువగా ఓట్లు పడే అవకాశం ఉంది.

తాజాగా బరిలో 47 మంది
జిల్లాలో 2018 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు బీఎస్పీ, సమాజ్‌వాది, బహుజన లెఫ్ట్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. హుజూర్నగర్‌ మినహా మిగతా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. స్వల్ప మెజారిటీతో రెండు నియోజకవర్గాల్లో గెలుపొందారు. ప్రధాన పార్టీలకు 40 వేలకుపైగా ఓట్లు నమోదు కాగా ఇతర చిన్న తరహా పార్టీల అభ్యర్థులకు మరో ఐదు వేల వరకు నమోదయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి నియోజకవర్గాల వారీగా 9 వేలకు పైనే ఓట్లు రావడం గమనార్హం. ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో సూర్యాపేటలో తొమ్మిది మంది, హుజూర్నగర్‌ 13, కోదాడ 21, తుంగతుర్తిలో నలుగురు, మొత్తంగా 47 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరు ఏ మేరకు గెలుపు ఓటములను ప్రభావం చూపుతారోనని ఆయా నియోజకవర్గాల్లో చర్చ సాగుతోంది.

తెలంగాణ వ్యాప్తంగా..
ఇక తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఆదిలాబాద్, పటాన్‌చెరు, పెద్దపల్లి, కొల్లాపూర్, సిరిసిల్ల, మునుగోడుతోపాటు 15 నియోజకవర్గాల్లో స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. సిరిసిల్లలో ఓడిపోకపోయినా కేటీఆర్‌ మెజారిటీని లగిశెట్టి శ్రీనివాస్‌ తగ్గిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లగిశెట్టి పద్మశాలి సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ప్రభావం కచ్చితంగా ఉంటుందంటున్నారు. ఇలా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఈసారి ఎవరి గెలుపోటములను శాసిస్తారో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular