Waste Engine Oil Stove Solution India: ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. హర్మూజ్ జలసంధి మూసివేయడంతో చమురు రవాణాకు ఆటంకం కలుగుతోంది. దీంతో చాలా దేశాలు సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల పరిస్థిది దారుణంగా మారింది. మన దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడింది. దీంతో కమర్షియల్ గ్యాస్ సరఫరాను కేంద్రం తగ్గించింది. దీంతో టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు మూతపడ్డాయి. దీంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో వంట గ్యాస్కు ఇబ్బందులు తప్పవని భావిస్తున్న ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు.
Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి
వేస్ట్ ఇంజినాయిల్ పరిష్కారం..
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేటకు చెందిన హోటల్ యజమాని నవాబ్జాన్ వినూత్న ఆవిష్కరణతో అందరినీ ఆశ్చర్యపరిచారు. యూట్యూబ్లో చూసి, వాడేసిన ఇంజిన్ ఆయిల్తో నడిచే పొయ్యిని తయారు చేయించుకున్నారు. కేవలం రూ.7 వేల ఖర్చుతో ఈ పొయ్యిని సిద్ధం చేసుకున్న నవాబ్జాన్, తక్కువ ఖర్చులో వంట చేసుకునే మార్గం కనుగొన్నాడు.
సరళమైన సాంకేతికతతో పొయ్యి..
నవాబ్జాన్ తయారు చేయించిన ఈ పొయ్యి తయారీ విధానం చాలా సరళంగా ఉంది. ప్లాస్టిక్ డబ్బాలో వాడేసిన ఇంజిన్ ఆయిల్ను నిల్వ చేశాడు. ట్యాంక్ నుంచి పైప్ ద్వారా ఆయిల్ బర్నర్కు చేరుతుంది. కరెంటుతో నడిచే చిన్న బ్లోయర్ ద్వారా బర్నర్కు గాలి సరఫరా జరుగుతుంది. గాలి వేగం, ఆయిల్ పరిమాణాన్ని బట్టి మంటను నియంత్రించేలా రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు.
గ్యాస్తో పోలిస్తే తక్కువ ఖర్చు..
నవాబ్ తయారు చేసిన పొయ్యి గ్యాస్తో పోలీస్తే ఖర్చు తక్కువగా వస్తుంది. హోటల్ యజమానులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేలు పొదుపు అవుతుంది. గ్యాస్తో పోలిస్తే 85 నుంచి 90 వాతం తక్కువ ఖర్చుతో వంట చేసుకోవచ్చు. పొయ్యి తయారీ ఖర్చు 2–3 నెలల్లోనే తిరిగి వచ్చేస్తుంది.
ఇతర ప్రాంతాల్లో ఆవిష్కరణలు..
నవాబ్జాన్ తరహాలో ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఆవిష్కరణలు జరిగాయి. విజయనగరంలో కాసా సత్యనారాయణ రూ.2,500 ఖర్చుతో ఇంజిన్ ఆయిల్ స్టవ్ తయారు చేశారు. 100 మిల్లీలీటర్ల ఆయిల్తో ముగ్గురికి సరిపడా వంట చేయవచ్చని తెలిపాడు.. కాకినాడలోని శంఖవరంకు చెందిన చిరు వ్యాపారి పాత ఇంజిన్ ఆయిల్తో పొయ్యి తయారు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా యువకుడు డీజిల్తో నడిచే పొయ్యి తయారు చేశాడు. లీటర్ డీజిల్తో 1.5 నుంచి 2 గంటలు వంట చేయవచ్చని తెలిపాడు.
నవాబ్జాన్ ఆవిష్కరణ గ్యాస్ సంక్షోభానికి స్థానిక పరిష్కారంగా నిలిచింది. సామాన్యుడి సృజనాత్మకతకు నిదర్శనం. అయితే, సురక్షితమైన వినియోగం, పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.