Telangana Rains Forecast: తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
అల్పపీడనం
సోమవారం నుంచి నైరుతి ఆవర్తనం ఏర్పడనుంది. దీంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోంది. వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సూర్యపేట, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని చెబుతోంది.
బుధవారం
బుధవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో, గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
వానల జాడేది?
నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా వర్షాలు మాత్రం జాడలేకుండా పోయాయి. దీంతో రైతులు హలో లక్ష్మణా అంటూ ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు పడితేనే పంటలు పండేది. కానీ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఇన్నాళ్లుగా వర్షాలు పడటం లేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వానలు పడకపోతే పంటల పరిస్థితి అధ్వానంగా మారే అవకాశం ఉంది.