Mahboob Ali Khan: తెలంగాణలో ఎన్నో రకాల సామ్రాజ్యాలు పరిపాలించాయి. శాలివాహనుల నుంచి నిజాం పాలన వరకు తెలంగాణను తమదైన శైలిలో అభివృద్ధి చేస్తూ వచ్చారు. తెలంగాణ చరిత్రలో హైదరాబాద్ రాజ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. హైదరాబాద్ రాజ్యం ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా నిజాం రాజుల పరిపాలనలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అనుకోవచ్చు. అయితే నిజాం రాజుల పరిపాలనలో అభివృద్ధితోపాటు కొన్ని ప్రదేశాల్లో ప్రజలకు రక్షణ కూడా కలిగిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా వన్య మృగాల నుంచి నిజాం రాజుల్లో ఒకరైన ప్రజలకు రక్షణ కల్పించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ వివరాలు లోకి వెళ్తే..
ఇటీవల పులులు జనాల్లోకి వస్తున్నాయి. గతంలో చిరుతలు మాత్రమే కనిపించగా.. ఇప్పుడు పెద్ద పులులు సైతం ప్రజల్లోకి వస్తున్నాయి. అయితే ఒకప్పుడు అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో పులుల సంచారం ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా ప్రస్తుతం మెదక్ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ వన్యమృగాల సంచారం విపరీతంగా ఉండేది. అయితే ఈ ప్రదేశంలో ఉన్న ప్రజల్లో 33 మందిని ఓ పెద్దపులి చంపేసింది. ఈ విషయం తెలుసుకున్న నిజాం రాజు పెద్దపులిని వేటాడి ప్రజలకు రక్షణ కల్పించారు. నిజాం రాజుల్లో ఆరో ప్రభువు అయిన మహబూబ్ అలీ ఖాన్ వారానికి కొన్నిసార్లు వేటకు వెళ్లేవారు. ఈ క్రమంలో ప్రస్తుతం పోచారం ప్రాంతంలోని అడవుల్లోకి వేటకు వెళ్లిన సమయంలో ఇక్కడ 33 మందిని చంపిన పులిని వేటాడి చంపినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ రాజుకు తీస్మార్ ఖాన్ అనే బిరుదు కూడా ఉంది. రెండు పులులను ఆయన చంపినట్లు ఫోటోలు కూడా ఉన్నాయి.
అయితే దట్టమైన అడవి కలిగిన ఈ పోచారం ప్రదేశం ఇప్పుడు వైల్డ్ లైఫ్ శంక్చూరి గా మారింది. మెదక్ జిల్లాలో ఉన్న ఇది పర్యాటక ప్రదేశంగా మార్చేశారు. దీనిని చూడడానికి హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తున్నారు. సుమారు 56 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యంలో ప్రస్తుతం 600కు పైగా జింకలు, నెమళ్లు, ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. మెదక్ పట్టణం నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యం సెలవుల్లో విహరించడం వల్ల ఎంతో హాయిగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి వెళ్లిన వారికి సఫారీ చేసే అవకాశం ఉంటుంది. పాఠశాలల విద్యార్థులు సైతం ఇక్కడికి సందర్శిస్తూ ఆహ్లాదంగా గడుపుతారు.