Devotees write letters Kondagattu temple: తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ మందిరాలు చాలానే ఉన్నాయి. ఇందులో కొన్ని స్వయంభు క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రముఖమైనది కొండగట్టు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండే ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొండగట్టు అంజన్న తమ ఇంటి దైవమని.. ఆ స్వామివారికి ఎంత చేసినా తక్కువేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కొండగట్టు ఆలయం మనదేశంలో మరే ప్రాంతంలో ఉన్నా సరే విస్తారమైన అభివృద్ధికి నోచుకునేది. కానీ కొండగట్టులో అభివృద్ధి మాత్రం అంతగా కనిపించడం లేదు. స్వామివారికి విశేషమైన చరిత్ర ఉన్నప్పటికీ.. అభివృద్ధి అంజనం వేసినా కనిపించడం లేదు. ఆలయ విస్తరణకు అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వాలు అంతగా పట్టించుకోవడం లేదు. ఈ క్షేత్రాన్ని గొప్ప గొప్ప నాయకులు సందర్శించినప్పటికీ.. ప్రభుత్వపరంగా తోడ్పాటు అంతగా లభించడం లేదు.
దశాబ్దాలుగా క్షేత్రం అలానే ఉండడంతో భక్తులకు విరక్తి కలిగింది. దీంతో స్వామివారిని సందర్శించుకునేందుకు వస్తున్న భక్తులు తమ నిరసనను విభిన్నంగా తెలియజేస్తున్నారు.. కొండగట్టు ఆలయ హుండీలో డబ్బులు వేయమని.. అభివృద్ధి చేస్తలేరు.. సౌకర్యాలు లేవు.. ఎందుకు డబ్బులు వేయాలని భక్తులు లేఖల రూపంలో హుండీలో వేస్తున్నారు. ఇటీవల స్వామి వారి హుండీ లెక్కింపు జరుగుతున్న క్రమంలో ఈ లేఖలు బయటపడ్డాయి. దీంతో కొండగట్టు ఆలయానికి సంబంధించి మరోసారి చర్చ మొదలైంది.
భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కొండగట్టు ఆలయ అభివృద్ధి జరగలేదు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అందువల్లే కొండగట్టు ఆలయాన్ని సందర్శించిన భక్తులు వినూత్న రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ లేఖలు చూసైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా.. కొండగట్టు ఆలయ అభివృద్ధికి కంకణం కట్టుకుంటుందా.. వేములవాడను, భద్రాద్రి రామాలయాన్ని, బాసర సరస్వతి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కొండగట్టు ఆలయం పై దృష్టి సారిస్తుందా.. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.