Bus Yatra: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణలో బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇది పూర్తిగా ఎన్నికల యాత్ర. కానీ దానిని చెప్పుకునే ధైర్యం కేసీఆర్కు గానీ, ఆ పార్టీకి గానీ లేదు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని, వారికి అండగా నిలిచేందుకు, వారి తరఫున పోరాడేందుకు వస్తున్నామని చెబుతోంది. అయితే ఈ యాత్రలో కేసీఆర్ ప్రజల నుంచి ఎదుర్కొనే తొలి ప్రశ్న ఇప్పుడు గుర్తొచ్చామా?
గతంలో ఎన్నో వైపరీత్యాలు..
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక వైపరీత్యాలు వచ్చాయి. రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు. కానీ ఏనాడు ఆ సమయంలో కేసీఆర్ బాధితుల వద్దకు వెళ్లలేదు. ప్రగతి భవన్, ఫామ్హౌస్లో కూర్చుని సమీక్షలు చేయడం, ప్రకటనలు విడుదల చేయడం, హెలిక్యాప్టర్లు ఎక్కి ఏరియల్ సర్వే చేయడం మినహా బాధితులతో మాట్లాడిన సందర్భం లేద. గతేడాది గోదావరికి వరదలు వచ్చి భద్రాచలం జిల్లాలోని అనేక గ్రామాలు మునిగిపోయాయి. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని తెలిపారు. కానీ రూపాయి కూడా ఇవ్వలేదు.
ప్రగతిభవన్ దాటని పాలకుడు..
అప్పట్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడినా.. ఎన్ని పోరాటాలు చేసినా వాటిని పట్టించుకోలేదు నాటి పాలకుడు కేసీఆర్. ప్రగతి భవన్ గడప దాటలేదు. ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేశాడు. పోలీసులను ప్రయోగించాడు. ప్రజల బాగోగులు కేసీఆర్కు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ ఏనాడూ ముందు ఉండి నడిపించలేదు. నాటి టీఆర్ఎస్కు ఊపొచ్చిన తర్వాత ఆయన పిలుపులు ఇవ్వడం మొదలు పెట్టారు. స్వయంగా ముందు ఉండి చేసిన పోరాటం ఒక్కటీ లేదు. అదే ప్రజలు అధికారం నుంచి గద్దె దించాక, ప్రతిపక్షానికి పరిమితం చేశాక ఇప్పుడు ప్రజలు గుర్తొచారు.
ఒక్క ఓటమితో ఎంత మార్పు..
ఒక్కసారి ఓటమి కేసీఆర్ను నేలకు దించింది. అహంకారాన్ని అంతం చేసింది. ప్రజలు గుర్తొచ్చేలా చేశారు. అధికారంలో ఉన్నపుపడు సీఎం ప్రజలను కలవడం లేదనే ప్రశ్నలకు కూడా మంత్రులే సమాధానం ఇచ్చారు. అంతా బాగున్నప్పుడు సీఎం ప్రజలను కలవాల్సిన పనిలేదు కదా అని వెనకేసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా నాడు ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోలేదు. విపత్తు సమయంలో కేటీఆర్, హరీశ్రావులు మాత్రమే బయటకు వచ్చేవారు. కానీ ఒక్క ఓటమి కేసీఆర్ను జనంలోకి వచ్చేలా చేసింది. అయితే ఆయన చేపట్టే బస్సు యాత్రలో ఆయన కచ్చితంగా ప్రజల నుంచి వచ్చే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
భయంగానే బస్సు యాత్ర..
మరోవైపు కేసీఆర్ బస్సు యాత్రను భయంగానే మొదలు పెడుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి. మరోవైపు పార్టీని వీడుతున్న నేతలు. ఈ పరిస్థితిలో లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుంది. పార్టీని కాపాడుకునేందుకే కేసీఆర్ యాత్ర మొదలు పెడుతున్నారు. దానికి ప్రజల కష్టాలను కారణంగా చూపుతున్నారు. అయితే ఈ యాత్ర ద్వారా బీఆర్ఎస్కు ఊపు రాకపోతే మాత్రం గులాబీ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. కేసీఆర్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అవుతుంది.