Zero Shadow Day Hyderabad: మండుటెండలో మన వెంట ఎప్పుడూ నీడ ఉంటుంది. కానీ ఎండలో ఉన్నా కూడా నీడ కనిపంచకపోవడం ఎప్పుడైనా గమనించారా..? ఒక్కసారిగా నీడ కనిపించకుండా పోతే ఎలా ఉంటుంది? ఇదే అరుదైన ఖగోళ వింత మే 9న Hyderabadలో కనిపించనుంది. మధ్యాహ్నం సుమారు 12.12 గంటల సమయంలో కొన్ని క్షణాల పాటు వస్తువుల నీడలు కనిపించకుండా పోతాయి. దీనిని శాస్త్రవేత్తలు ‘ జీరో షాడో డే’గా పిలుస్తారు. అసలు ఇలా ఎందుకు ఏర్పడుతుంది? గతంలో ఏ నగరంలో ఇలా జరిగింది..?
భూమి పరిభ్రమణం, సూర్యుడి కిరణాలు భూమిపై పడే కోణం కారణంగా ఈ అరుదైన ఘటన ఏర్పడుతుంది. సాధారణంగా సూర్యకిరణాలు ఒక కోణంలో పడటంతో మనకు నీడ కనిపిస్తుంది. కానీ సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో సూర్యుడు భూమిపై ఉన్న కొన్ని ప్రాంతాలకు నేరుగా తలపైకి వస్తాడు. ఆ సమయంలో సూర్యకిరణాలు సుమారు 90 డిగ్రీల కోణంలో నిటారుగా పడటంతో నీడ వస్తువుల కిందకు చేరిపోతుంది. దీంతో నీడ కనిపించకుండా పోయినట్టుగా అనిపిస్తుంది.
కర్కాటక రేఖ, మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాల్లోనే ఈ దృశ్యం కనిపిస్తుంది. భారతదేశంలోని అనేక నగరాల్లో ప్రతి ఏడాది ఒక్కసారి లేదా రెండుసార్లు ఈ జీరో షాడో డే కనిపిస్తుంది. ఈసారి Hyderabadలో ఈ వింత చోటుచేసుకోనుంది. అయితే గతంలో ఏప్రిల్ 24న బెంగుళూరు లో కూడా ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించారు. ఇలాంటి సమయంలో నిలువుగా ఉన్న వస్తువులు ఉదాహరణకు స్తంభాలు, బాటిళ్లు, చెట్లు లేదా మనుషులు వాటి నీడలను స్పష్టంగా చూపించవు. కాసేపటి పాటు నీడలు పూర్తిగా మాయమైనట్టుగా కనిపిస్తాయి. విద్యార్థులు, ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక ప్రత్యేక అనుభవంగా భావిస్తారు.
జీరో షాడో డే అనేది ఎలాంటి అద్భుతం లేదా ప్రమాదకర ఘటన కాదు. ఇది పూర్తిగా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సహజ ప్రక్రియ మాత్రమే. భారతదేశంలో ఉన్న ఖగోళ పరిశోధనా సంస్థలు, సైన్స్ సెంటర్లు ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాయి. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ ఘటన ద్వారా భూమి అక్ష వంగుదల, సూర్యుడి స్థాన మార్పులు, ఋతు మార్పుల గురించి సులభంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ రోజును ఖగోళ శాస్త్ర ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.