Jagtial Politics: కాంగ్రెస్ సీనియర్ నేత.. నాలుగు దశాబ్దాలుగా ఆ పార్టీలో కొనసాగిన కురవృద్దుడు.. శేష జీవితం ప్రశావంతంగా గడుపుతానని ప్రతీ ఎన్నికల్లో ఇవే నాకు చివరి ఎన్నికలు అంటూ ప్రకటిస్తూ.. ఓటమి చవి చూస్తున్న జీవన్రెడ్డి.. ఇటీవలే హస్తం పార్టీకి గుడ్బై చెప్పారు. బీఆర్ఎస్ నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్కుమార్ కాంగ్రెస్లో చేరడం జీవన్రెడ్డి జీర్ణించుకోలేదు. పార్టీ మార్పిడి నిర్ణయం జగిత్యాల జిల్లా రాజకీయాల్లో భూకంపాన్ని సృష్టించింది. 1990 నుంచి జిల్లాలో ఆయన ప్రభావం ఎమ్మెల్యే టికెట్ల నుంచి మంత్రి పదవుల వరకు విస్తరించింది. ఈ చర్యతో స్నేహితులు విడిపోతూ, ప్రత్యర్థులు బలపడుతున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఎన్నికల్లో విజయవంతమైన అనేక మంది ఇప్పుడు కొత్త మార్గాలు వెతుకుతున్నారు.
విధేయత వర్సెస్ గౌరవం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తాజా రాజకీయ పరిణామాలు సంక్లిష్టంగా మారాయి. జీవన్ రెడ్డిని గురువుగా గౌరవించి, 2018 ఎన్నికల్లో ఆయన సపోర్ట్తో విజయం సాధించిన లక్ష్మణ్కుమార్ ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు గురువుపై విమర్శలు చేయాల్సి వచ్చింది. గురువు మార్గదర్శనాన్ని వదులుకుని పార్టీకి లాయల్టీ చూపితే, స్థానిక ప్రజల సపోర్ట్లో లోటు పడవచ్చు. లేకపోతే, పార్టీలో స్థానం కోల్పోయే ప్రమాదం. ఈ సంక్లిష్ట పరిస్థితి అడ్లూరి రాజకీయ కెరీర్ను మలుపు తిప్పుతోంది.
జిల్లా రాజకీయాల్లో తలనొప్పులు..
జీవన్రెడ్డి చర్య జగిత్యాలలో అధికార పద్ధతులను కుదిపిస్తోంది. బీఆర్ఎస్ ఈ విభేదాలను ఉపయోగించుకుని, స్థానిక అసంతృప్తి వర్గాలను తనవైపు మళ్లించుకుంటోంది. బీజేపీ కూడా కొత్త మైదానాలు తెరుస్తోంది. గత ఎన్నికల్లో జీవన్ ప్రభావంతో కాంగ్రెస్ బలపడినా కొన్ని మండలాలు ఇప్పుడు అనిశ్చితంలో ఉన్నాయి. వీటిని తనవైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో రాయికల్ మున్సిపాలిటీలో బీజేపీ పట్టు సాధించడమే ఇందుకు నిదర్శనం.
గురు–శిష్యుల మధ్య ఈ ఉద్రిక్తత ఓ పూర్తి రాజకీయ యుద్ధానికి దారితీస్తుందా అనేది కీలక ప్రశ్న. జీవన్ రెడ్డి కొత్త పార్టీలో బలపడి, స్వతంత్ర అభ్యర్థులను ప్రోత్సహిస్తే, అడ్లూరి వర్గాలు విడిపోతాయి. అయితే, రహస్య సమావేశాల ద్వారా సమాధానం కనుక్కుంటే, జిల్లా రాజకీయాలపై అడ్లూరి పట్టు సాధించే అవకాశం ఉంటుంది. మంత్రిగా కూడా ఉన్న నేపథ్యంలో ఆయన నిర్ణయాలు ఇప్పుడు పార్టీకి దిశానిర్దేశం కానున్నాయి.