HomeతెలంగాణJeevan Reddy: ‘పొన్నం’కు పదవీగండం.. ఉమ్మడి కరీంనగర్‌ కోటాలో జీవన్‌రెడ్డికి ఛాన్స్‌!

Jeevan Reddy: ‘పొన్నం’కు పదవీగండం.. ఉమ్మడి కరీంనగర్‌ కోటాలో జీవన్‌రెడ్డికి ఛాన్స్‌!

Jeevan Reddy: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాలు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పదవీగండం పొంచి ఉందా అంటే అవుననే అంటున్నాయి గాంధీభవన్‌ వర్గాలు. జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడమే పొన్నం పదవికి ముప్పు తెచ్చిందని అంటున్నారు. సంజయ్‌ చేరికను వ్యతిరేకిస్తూ పదవికి, పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని అధిష్టానం బుజ్జగిస్తోంది. అయితే రెండు రోజులపాటు జరిపిన సంప్రదింపులతో జీవన్‌రెడ్డి మెత్తబడలేదు. దీంతో ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు నేతలు. దీంతో రంగంలోకి దిగిన కేసీ.వేణుగోపాల్‌ ఎమ్మెల్సే జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. మంత్రి పదవి ఆఫర్‌ చేయడంతో రాజీనామా విషయంలో జీవన్‌రెడ్డి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

కరీంనగర్‌ కోటాలో పొన్నంకు పదవి…
అసెంబ్లీ ఎన్నికల అనంతరం డిసెంబర్‌ 7న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం చేశారు. మరో 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఈ క్రమంలో మంత్రి పదవుల ఎంపిక ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జరిగింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోటాలో శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ను పదవులు వరించాయి. సీనియర్‌ నేత అయిన జీవన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పొన్నం ప్రభాకర్‌ను మంత్రి పదవి వరించింది. జీవన్‌రెడ్డి గెలిచి ఉంటే.. పొన్నంకు అవకాశం దక్కేది కాదు.

తాజాగా జీవన్‌రెడ్డికి ఆఫర్‌..
జగిత్యాలలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఎమ్మెల్యే సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరడంతో సీనియన్‌ నేత జీవన్‌రెడ్డి పదవితోపాటు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ నేత కేసీ. వేణుగోపాల్‌ జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి మంత్రి పదవి ఆఫర్‌ చేశారు.

జూలై 3 లేదా 4న మంత్రివర్గ విస్తరణ..
ఇదిలా ఉండగా, రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో మిగిలిన 6 పదవులను భర్తీ చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. ఎవరెవరికి పదవులు ఇచ్చేది అధిష్టానంతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో జీవన్‌రెడ్డికి మంత్రి పదవి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మూడో నేతకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే.. పొన్నంను తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలా కాకుండా పొన్నం ప్రభాకర్‌ను ఉమ్మడి మెదక్‌ జిల్లా కోటాలో పరిగణిస్తే.. జీవన్‌రెడ్డికి లైన్‌ క్లియర్‌ అయినట్లే అని తెలుస్తోంది. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular