
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుత పాలక మండలి పదవీ కాలం జనవరి 10వ తేదీతో ముగియనుంది. 91 సెక్షన్ ప్రకారం మొదటిసారిగా పాలక మండలి సమావేశంలోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఈసీ పేర్కొంది. సెక్షన్ 88డీ ప్రకారం.. గెలిచిన అభ్యర్థులను కార్పొరేటర్లుగా ప్రకటించిన నెల రోజుల లోపే మొదటి పాలక మండలి సమావేశం జరగాలని ఈసీ మార్గదర్శకాలలో పేర్కొన్నారు. పాలక మండలి సమావేశం జరిగిన నాటి నుంచి ఆ కార్పొరేటర్ల పదవీ కాలం 5 సంవత్సరాల పాటు ఉంటుందన్నారు. కాగా, జనవరి 10 తరువాత తాజాగా గెలిచిన అభ్యర్థులను కార్పొరేటర్లుగా ప్రకటిస్తూ ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.