SRH Vs MI: ఐపీఎల్ లో ప్రతి బంతి కూడా అత్యంత ముఖ్యం. ప్రతి పరుగు కూడా అత్యంత అవసరం. వీటన్నింటి కంటే వికెట్లు అత్యంత కీలకం. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు మర్చిపోయారు. అందువల్లే హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తగిన మూల్యం చెల్లించుకున్నారు. గెలవాల్సిన చోట ఓడిపోయి.. గెలిచే అవకాశం ఉన్నా సరే వినియోగించుకోలేక ఓటమిపాలయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నవ్వుల పాలవుతున్నారు.
ఈ మ్యాచ్లో ముంబై జట్టు ఏకంగా 243 పరుగుల స్కోర్ చేసింది. ఇంత స్కోర్ చేసినప్పటికీ గెలవలేకపోయింది. దీని అంతటికి ప్రధాన కారణం ముంబై ప్లేయర్లే. సొంత మైదానంలో అంత స్కోర్ చేసినప్పటికీ.. సొంత అభిమానుల ప్రోత్సాహం విపరీతంగా ఉన్నప్పటికీ ముంబై జట్టు గెలవలేదంటే అంతకుమించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు.
ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లు తేలిపోయారు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయారు. ముఖ్యంగా హైదరాబాద్ ఆటగాడు హెడ్ బ్యాట్ కు బంతి తగిలి కీపర్ చేతులకు వెళ్లినప్పటికీ.. ముంబై ప్లేయర్లు అప్పీల్ చేయలేదు. అప్పటికి అతడి స్కోరు 20 పరుగులు మాత్రమే. ఈ జీవ దానంతో రెచ్చిపోయిన హెడ్ 30 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అతడి భీకరమైన ఇన్నింగ్స్ ముంబై జట్టు పోవడానికి కారణమైంది.
హెడ్ అప్పుడు మాత్రమే కాదు.. మరో మూడు క్యాచులను కూడా ముంబై జట్టు ప్లేయర్లు వదిలేశారు. మూడు సందర్భాల్లో కూడా నమన్ ధీర్ హెడ్ క్యాచ్ లు వదిలేయడం విశేషం. తద్వారా హెడ్ మరింత రెచ్చిపోయాడు. ఈ సీజన్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అతడికి అభిషేక్ శర్మ తోడు కావడంతో హైదరాబాద్ జట్టు స్కోరు రాకెట్ వేగాన్ని మించి దూసుకుపోయింది. తొలి వికెట్ కు హెడ్, అభిషేక్ శర్మ 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత హైదరాబాద్ జట్టు మరింత వేగంతో ఆడింది. కీలక ఆటగాడు ఇషాన్ కిషన్ 0 పరుగులకు అవుట్ అయినప్పటికీ.. క్లాసెన్(65*) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. కీలకమైన క్యాచ్ లు నేలపాలు చేయడం.. ఆటగాళ్లు సరిగా బౌలింగ్ చేయలేకపోవడంతో ముంబై జట్టు ఓటమిని కొని తెచ్చుకుంది. ఈ ఓటమితో ముంబై జట్టు ప్లే ఆఫ్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది..