Rohit Sharma comeback: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై జట్టుకు ఘన చరిత్ర ఉంది. ఐదుసార్లు ఈ జట్టు విజేతగా నిలిచింది. అన్ని సందర్భాలలో కూడా ముంబై జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు. అతని నాయకత్వంలో ముంబై జట్టు అప్రతిహత విజయాలు సాధించింది. 2024 సీజన్ నుంచి ముంబై జట్టు సారధిగా హార్దిక్ పాండ్యా నియమితుడయ్యాడు. అప్పటినుంచి అతడు జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతడి నాయకత్వంలో ముంబై జట్టు 2024లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 2025లో నాలుగో స్థానంలో నిలిచింది.
ప్రస్తుత ఐపీఎల్ లో ముంబై జట్టు అంత గొప్పగా ఆడటం లేదు. పాయింట్ల పట్టికలో చివరి వరుసలో ఉంది. ముంబై జట్టు ప్లే ఆఫ్ దాకా వెళ్లాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ లో భారీ అంతరంతో విజయం సాధించాలి. అప్పుడే నెట్ రన్ రేట్ మెరుగుపడుతుంది. తద్వారా ముంబై జట్టు ప్లే ఆఫ్ దాకా వెళ్తుంది.. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంబై జట్టు ఆస్థాయిలో విజయాలు సాధిస్తుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి.
హార్దిక్ పాండ్యా నాయకత్వంలో జట్టులో ఐకమత్యం లోపించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఆ జట్టు విజయాలు సాధించలేకపోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ముంబై జట్టు లో ఓపెనర్, కీలక ఆటగాడు రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు లేకుండా పోయాడు. కొద్ది మ్యాచ్లకు దూరమైన రోహిత్ శర్మ.. హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్ కి అందుబాటులోకి వస్తున్నాడు. ఇదే విషయాన్ని ముంబై జట్టు యాజమాన్యం ప్రకటించింది.
రోహిత్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. అందువల్ల పరుగులు తీయడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల మ్యాచ్ ఆడుతున్నప్పుడే అతడు నొప్పితో ఇబ్బంది పడిపోయాడు. అందువల్లే అతడు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో అతడు కొన్ని మ్యాచ్లకు దూరం కావడంతో.. వాటిల్లో ముంబై జట్టు ఓడిపోయింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ జట్టు జరిగే మ్యాచ్ కు రోహిత్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ముంబై జట్టు బ్యాటింగ్ బలం పెరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ జట్టు మీద రోహిత్ శర్మకు బలమైన రికార్డు ఉంది. గాయం తర్వాత కోలుకుని మైదానంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. రోహిత్ శర్మ గతంలో మాదిరిగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడితే హైదరాబాద్ జట్టుకు షాక్ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
