IPL history and growth: ఒక వ్యక్తి మదిలో మిగిలిన ఆలోచన క్రికెట్ గతిని మొత్తం మార్చేసింది. అప్పటిదాకా మూస ధోరణిలో సాగుతున్న క్రికెట్.. కార్పొరేట్ కళను సంతరించుకుంది. క్రికెటర్ల మీద కాసుల వర్షం కురిపించింది. కంపెనీలకు కోట్ల లాభాలను అందించింది..
2008లో ఏప్రిల్ 18న ఐపీఎల్ ప్రారంభమైంది. నాడు లలిత్ మోడీ ఆలోచన చేయడంతో ఐపీఎల్ పుట్టింది. ప్రారంభంలో ఎనిమిది జట్టతో ఐపీఎల్ మొదలైంది. నాడు ఐపీఎల్ వ్యాల్యూ 3,100 కోట్లుగా ఉండేది. ఇప్పుడు ఐపీఎల్ ఏకంగా 10 బృందాలతో గొప్పగా వర్ధిల్లుతోంది. 2026 సీజన్ నాటికి ఐపీఎల్ బ్రాండ్ వేల్యూ ఇప్పుడు ఏకంగా లక్షా యాభై కోట్లకు చేరుకుంది. ఇప్పుడు వరకు ఐపీఎల్ లో చెన్నై, ముంబై చెరి ఐదుసార్లు ట్రోఫీలు సాధించాయి.. కోల్ కతా మూడుసార్లు ట్రోఫీలు అందుకుంది.. సన్ రైజర్స్ రెండు ట్రోఫీలు అందుకున్నది.. బెంగళూరు, గుజరాత్, రాజస్థాన్ తలా ఒకసారి టైటిల్ అందుకున్నాయి.
ఐపీఎల్ ప్రారంభంలో ఈ స్థాయిలో విజయవంతమవుతుందని ఎవరూ ఊహించలేదు. తన కార్పొరేట్ తెలివి ద్వారా లలిత్ మోడీ ఐపీఎల్ కొత్త కళ తీసుకొచ్చారు. బ్రాండ్ ఇమేజ్ మొత్తం పెంచారు. ఫలితంగా ఐపిఎల్ అనేది అత్యంత విలువైన క్రికెట్ లీగ్ గా మారింది. వివాదాలు, ఇతర ఆరోపణలు పక్కన పెడితే ఐపిఎల్ అనేది క్రికెటర్లకు అద్భుతమైన ఆదాయ వనరుగా మారింది.
ఎంతోమంది క్రీడాకారులకు ఐపీఎల్ అవకాశాలు కల్పించింది. వారిలో ఆర్థిక భరోసాను పెంచింది. ప్రకటనల ద్వారా.. టికెట్ ద్వారా.. డిజిటల్ ప్రసారాల హక్కుల ద్వారా.. ఐపీఎల్ లోని ఆయా జట్ల యాజమాన్యాలకు ఆదాయం లభిస్తుంది. అందువల్లే ఐపీఎల్ అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ గా అవతరించింది. లలిత్ మోడీ మీద అనేక రకాలుగా విమర్శలు వచ్చినప్పటికీ.. అతడు దేశం దాటి వదిలి వెళ్ళిపోయినప్పటికీ.. ఐపీఎల్ ఇప్పటికీ సగటు భారతీయుడికి ఒక ఎమోషన్ లాగా మారింది. వేసవి కాలంలో సుమారు రెండు నెలల పాటు అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ ఆనందాన్ని అందిస్తోంది.
ఐపీఎల్ ద్వారా ఆదాయం దండిగా వస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలకు సంబంధించిన క్రికెటర్లు ఇందులో ఆడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. క్రికెటర్ల ఆసక్తిని మరింత పెంచేందుకు యాజమాన్యాలు భారీగా ధర చెల్లిస్తున్నాయి. కొంతమంది క్రీడాకారుల కైతే 20+ కోట్ల ఫీజు లభిస్తోందంటే మామూలు విషయం కాదు. ఒక ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ కూడా సంపాదించలేని సంపాదనను క్రికెటర్లు ఆర్జిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఐపిఎల్. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఐపీఎల్ వల్ల ఎన్నో దేశాలు క్రికెట్ లీగ్ లు మొదలుపెట్టాయి. కానీ, ఐపీఎల్ స్థాయిని మాత్రం అందుకోలేకపోయాయి.