Vibhav Surya Vamsi under pressure: కొన్నిసార్లు అభిమానం హద్దులు దాటిపోతుంది. అంచనాలను మించిపోతుంది. మన వరకు అభిమానం కరెక్ట్ గానే ఉంటుంది. కానీ దాన్ని మోసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బరువు. ఆ బరువు దించుకునే క్రమంలో సెలబ్రిటీలు పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. ఒక వయసులో ఆ ఇబ్బంది పెద్దగా బరువు అనిపించదు గాని.. 15 సంవత్సరాల వయసులో టన్నుల అభిమానాన్ని మోయాలంటే చాలా కష్టం. దాన్ని దించుకోవాలంటే కూడా కష్టమే. ఇప్పుడు ఇదే పరిస్థితిని టీమిండియా యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్య వంశీ అనుభవిస్తున్నాడు.
సూర్య వంశీ ఇటీవలి ఐపిఎల్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. ఒక సెంచరీ.. హాఫ్ సెంచరీలతో అతడు అదరగొట్టాడు. మూడుసార్లు సెంచరీకి దగ్గరగా వచ్చి అవుట్ అయ్యాడు. సూర్యవంశీ ఐపీఎల్లో అదరగొట్టిన నేపథ్యంలో అతడికి జాతీయ జట్టులో అవకాశం కల్పించారు. ఐర్లాండ్.. ఇంగ్లాండ్ టూర్ లో అతడికి చోటు కల్పించారు.
ప్రస్తుతం సూర్య వంశీ శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఆడుతున్నాడు. అతడి మీద భారీగా అంచనాలు ఉండడంతో.. తట్టుకోలేకపోయాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. మూడు బౌండరీలు సాధించి సౌకర్యవంతంగా కనిపించినప్పటికీ.. అతడు మహమ్మద్ షిరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఐపీఎల్ లో పంజాబ్ జట్టు తరఫున అదరగొట్టిన ప్రభ్ సిమ్రాన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.. ప్రియాంష్ ఆర్య 32.. పరుగులతో సత్తా చూపించాడు. అయితే చెన్నై జట్టు సారధిగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా 101 పరుగులు చేసి సత్తా చూపించాడు.
సూర్యవంశీ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. కెప్టెన్ తిలక్ వర్మ (60) గైక్వాడ్ తో కలిసి సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డాడు. అందువల్లే టీం ఇండియా గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. సూర్య వంశీ మీద మీడియా కూడా విపరీతంగా ఫోకస్ పెట్టడం.. అతని ఆట ఎలా ఉంటుందో ముందస్తుగానే అంచనాలు వేయడంతో.. సూర్య వంశీ ఒత్తిడి ఎదుర్కొన్నాడు. మైదానంలోకి దిగడమే అతడు కాస్త అసహనంగా కనిపించాడు. అందువల్లే త్వరగా అవుట్ అయ్యాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపై అతడిని స్వేచ్ఛగా ఆడుకొని ఇవ్వాలని.. అతడి మీద అనవసరమైన ఒత్తిడి పెట్టకూడదని విశ్లేషకులు సూచిస్తున్నారు.
