Narasimha Jayanti 2026: శ్రీమహావిష్ణు అవతారాల్లో నరసింహుడి అవతారం ఒకటి. ధర్మం, అధర్మం మధ్య జరిగే యుద్ధాన్ని నరసింహ అవతారం తెలుపుతుంది. భక్తులను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు ఉగ్రరూపమైన నరసింహుడిగా వైశాఖ శుక్ల చతుర్దశి రోజున అవతరించారు. ఈ పర్వదినం మనకు ధర్మం ఎప్పటికీ గెలుస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తుంది. అసలు నరసింహ జయంతి ఇచ్చే సందేహం ఏంటీ? ఈరోజున ఏం చేయాలి?
ఎంతటి శక్తివంతమైన అధర్మం ఉన్నా.. చివరికి ధర్మమే విజయం సాధిస్తుంది అని నరసింహ జయంతి తెలుపుతుంది. భక్తి, నిజాయితీ, ధర్మబద్ధమైన జీవితం ఉంటే దేవుడు తప్పకుండా కాపాడతాడనే విశ్వాసాన్ని ఈ కథ బలంగా చెబుతుంది. అహంకారం ఎంత పెద్దదైనా, అది వినాశానికే దారితీస్తుందని కూడా ఇది హెచ్చరిస్తుంది.
అసురరాజు హిరణ్యకశపుడు బ్రహ్మదేవుడి నుంచి ‘మనిషి చేత కానీ, జంతువు చేత కానీ చావకూడదు పగలు కాదు, రాత్రి కాదు.. లోపల కాదు, బయట కాదు.. నేలపై కాదు, ఆకాశంలో కాదు.. ఏ ఆయుధంతోనూ చావకూడదు.’ అనే ప్రత్యేకమైన వరం పొందాడు. ఈ వరంతో అతను తాను అమరుడిననే భావంతో అధర్మానికి పాల్పడుతాడు.
అయతే హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణుభక్తుడిగా నిలిచాడు. తన తండ్రి ఎంత హింసించినా, ప్రహ్లాదుడు విష్ణుని భక్తిని విడిచిపెట్టలేదు. ఈ భక్తిని కాపాడేందుకు, అలాగే హిరణ్యకశిపుడి అహంకారాన్ని చెరిపేయడానికి మహావిష్ణువు నరసింహుడిగా అవతరించాడు. నరసింహుడు అర్థమానవుడు, అర్థసింహం రూపంలో వచ్చి, సాయంకాల సమయంలో (పగలు కాదు, రాత్రి కాదు), ఇంటి మేడిపైన (లోపల కాదు, బయట కాదు), తన మోకాలిపై కూర్చోబెట్టి (నేల కాదు, ఆకాశం కాదు), గోర్లతో (ఆయుధం కాదు) హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇలా బ్రహ్మ ఇచ్చిన వరాన్ని అతిక్రమించకుండా అధర్మాన్ని నిర్మూలించాడు.
నరసింహ జయంతి రోజు ఆచరణలో పెట్టే పూజలు, నియమాలు భక్తికి ఎంతో ప్రాధాన్యం కలిగిస్తాయి. ఈ రోజు నరసింహుడును స్మరించి ఉపవాసం, పూజలు చేస్తే శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతారు. కొందరు పూర్తిగా నిరాహారంగా ఉంటారు, మరికొందరు పండ్లు లేదా పాలు మాత్రమే తీసుకుంటారు. ఇంటి వద్ద లేదా దేవాలయంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన నరసింహుడికి ప్రత్యేక పూజలు చేయాలి. పసుపు, కుంకుమ, పూలతో పూజ చేసి, దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలి. పంచామృతాభిషేకం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు.నరసింహుడికి సంబంధించిన మంత్రాలు, ముఖ్యంగా “ఉగ్రం వీరం మహావిష్ణుం…” వంటి శ్లోకాలను జపించడం చాలా మంచిది. అలాగే విష్ణు పురాణం లేదా నరసింహ స్వామి కథను చదవడం, వినడం చేయాలి.
ఈ రోజు అన్నదానం, దానధర్మాలు చేయడం చాలా శుభకరం. పేదలకు ఆహారం, వస్త్రాలు ఇవ్వడం ద్వారా పుణ్యం పెరుగుతుందని నమ్మకం. నరసింహుడి అవతారం సాయంకాల సమయంలో జరిగినట్లు భావిస్తారు. కాబట్టి సాయంత్రం సమయంలో ప్రత్యేక పూజ చేయడం ముఖ్యంగా భావిస్తారు.ఈ రోజు కోపం, అహంకారం వంటి చెడు గుణాలను దూరంగా ఉంచి, శాంతంగా, భక్తితో గడపాలి. సత్యం, ధర్మం పాటించాలని సంకల్పించాలి.