Merger of AP and Telangana : తెలుగు రాజకీయాలు మళ్లీ విద్వేషపూరితంగా మారుతున్నాయి. దీనికి జగన్ జిగ్రీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అగ్గి రాజేస్తే.. మరో సీనియర్ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ పెట్రోల్ పోశారు. ఈ మంటల్లో తెలంగాణ ఆవేశ ప్రజాప్రతినిధులు అప్పుడే ఫైరింగ్ షురూ చేశారు. దీంతో సామరస్యంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మరో ‘సమైక్య రాష్ట్ర’ లొల్లి షూరూ అయ్యింది.

60 ఏళ్ల పోరాటం ఫలితంగా తెలంగాణ వచ్చింది. అప్పుడెప్పుడో 1960వ దశకంలో మొదలైన తెలంగాణ ఉద్యమ వేడి 2014లో స్వరాష్ట్రం ఏర్పాడ్డాక చల్లారింది. ఇందుకోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడింది. పాలకులు ఎవరైనా సరే.. ఎలా పాలించినా సరే.. ‘రాష్ట్రం’ కోసం ఒక్కతాటిపైకి వచ్చిన ‘సకల జనులు సమ్మె’ చేసి సాధించిన్నది తెలంగాణ రాష్ట్రం. సమైక్యాంధ్ర కోసం ఏపీ వాసులు ఎన్ని ఉద్యమాలు.. కుట్రలు చేసినా ఎదురించి పోరాడిన ఉద్యమాల నేల ఇదీ.. రాజకీయ కారణాలో లేక పోరాట ఫలితమే ఉమ్మడి ఏపీ విడిపోయి తెలంగాణ, అవిభాజ్య నవ్యాంధ్రగా ఏర్పడ్డాయి. ఇక్కడితో కథ సుఖాంతం అయ్యిందని అందరూ అనుకున్నారు. ఎవరి సంసారం వాళ్లు చేసుకుంటూ వస్తున్నారు.

కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.. ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ తేనెతుట్టెను కదిపారు. ‘సమైక్య ఆంధ్ర’ మరోసారి కావాలని సంచలన కామెంట్స్ చేశారు. ‘కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానం. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారు. ఏపీని కలుపేసే ఏ అవకాశాన్ని మేం వదులుకోం. ఏపీ మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా తమ వైసీపీ పార్టీ, తమ ప్రభుత్వం దానికే ఓటు వేస్తుంది. ’ అని సంచలన కామెంట్స్ చేశారు. జగన్ కు రైట్ హ్యాండ్ అయిన సజ్జల చేసిన ఈ కామెంట్స్ దుమారం రేపాయి. ఇది జగన్ కామెంట్ గానే అందరూ భావిస్తారు. ఆయన కొత్తగా సమైఖ్యాంధ్ర వాదన లేవనెత్తడం అందరిలోనూ అనుమానాలు పెంచింది.

దీనికి ఏపీ వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పెట్రోల్ పోశారు. మరింతగా మంట రాజేశారు. ‘ఏపీ తెలంగాణ కలిసే పరిస్తితి వస్తే స్వాగతిస్తాం.. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఒకవేళ వైసీపీని అడిగితే రెండు రాష్ట్రాలు కలవాలని చెప్తాము. రాష్ట్ర విభజన అంశంపై ఇప్పటివరకూ పోరాడుతున్నాం.. చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవన్నీ రావాలి.’ అంటూ మరింతగా ఈ వివాదాన్ని రాజేశారు.
ఇక సమైఖ్యాంధ్ర అంటూ వైసీపీ ఏదో వ్యూహం ప్రకారం వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ భగ్గుమంది. ఇంత మంది బలిదానాలతో ఇంత ఆందోళనలతో సాధించుకున్న తెలంగాణ మళ్లీ ఆంధ్రతో కలవడాన్ని ఎవరూ జీర్ణించుకోవాలనుకోవడం లేదు. అందుకే కాంగ్రెస్ మాజీ ఎంపీ, నాడు పార్లమెంట్ లో తెలంగాణ కోసం పోరాడిన పొన్నం ప్రభాకర్ దీనిపై భగ్గుమన్నారు. ‘సజ్జల వ్యాఖ్యలు చూస్తే మళ్లీ తెలంగాణ మీద దాడి జరిగే కుట్ర జరుగుతోందని అనిపిస్తోందని.. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవాలి తప్ప.. తెలంగాణలో రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు.
ఇక ఆఖరుకు ఆంధ్రా ఆడకూతురు.. జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కూడా మళ్లీ ఏపీ, తెలంగాణ కలవడాన్ని తప్పుపట్టింది. ‘ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణను ఏపీని కలపడం అసాధ్యం. విడిపోయిన రాష్ట్రాలను ఎలా కలుపుతారు.. మీరు రెండు రాష్ట్రాలను కలపడం కాదు.. మీ ఏపీ అభివృద్ధి కోసం పోరాటం చేయండి.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దు’ అంటూ షర్మిల సైతం ప్రస్తుతం ఇక్కడ రాజకీయం చేస్తుండడంతో ఈ రాష్ట్రానికే మద్దతు పలికింది.
తెలంగాణ, ఏపీ విడిపోయి ఎవరి సంసారం వాళ్లు చేసుకుంటున్నారు. ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు. ఎవరి పాలన.. ఎవరి అభివృద్ధి వారు చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో వైసీపీ పద్ధతి ప్రకారం మళ్లీ రెండు రాష్ట్రాలు కలపాలన్న వాదన తెరపైకి తెచ్చింది. వివాదాన్ని రాజేసింది. తెలంగాణ భగ్గుమంది. ఇప్పటికైతే వైసీపీ జిగ్రీ దోస్త్ అయిన టీఆర్ఎస్ దీనిపై స్పందించలేదు. ఇదంతా చూస్తుంటే.. వైసీపీది పెద్ద స్కెచ్ అని తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీ దివాళ తీసిందని వార్తలు వస్తున్నాయి… కేంద్రం నిధులు వెనక్కి తీసుకోవడంతో ఏపీ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వ ప్రతిష్ట మంటగలవకుండా వైసీపీ బ్యాచ్ వ్యూహాత్మకంగా రెండు రాష్ట్రాలు కలపాలన్న వాదనను తెరపైకి తెచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇదే ప్లాన్ వర్కవుట్ చేస్తే తెలంగాణ నేతలు భగ్గుమని లొల్లి చేస్తారని.. తమ ప్రభుత్వ వైఫల్యం కనిపించదన్న ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ వైసీపీ మాయలో తెలంగాణ నేతలు పడిపోయారు. ఇప్పటికే కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ టాపిక్ ను విజయవంతంగా డైవర్ట్ చేసిందనే చెప్పాలి.