Homeక్రీడలుIPL 2023 Play Offs : ప్లే ఆఫ్ రేస్ కు తీవ్రమైన పోటీ.. ఏ...

IPL 2023 Play Offs : ప్లే ఆఫ్ రేస్ కు తీవ్రమైన పోటీ.. ఏ జట్లకు అవకాశం ఉందంటే..!

IPL 2023 Playoffs Chances : ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2023 లీగ్ దశ దాదాపు ముగింపుకు వస్తోంది. ఒక్కో జట్టు ఒకటి, రెండు మ్యాచ్ లు ఆడితే లీగ్ దశ ముగుస్తుంది. ఈసారి ప్లే ఆఫ్ చేరేందుకు ఎక్కువ జట్లు పోటీ పడుతుండడంతో ఈ రేస్ ఆసక్తికరంగా మారింది.

ఐపీఎల్ 16వ ఎడిషన్ అభిమానులను ఎంతగానో ఉత్సాహపరిచింది. ఈ ఏడాది దాదాపు అన్ని మ్యాచ్ లు అభిమానులకు ఎంటర్టైన్మెంట్ ను అందించాయి. ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లడంతో అభిమానులు మునివేళ్లపై నిలబడి ఫలితం కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఫీలింగ్ ను అభిమానులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ లీగ్ దశ ముగింపుకు వచ్చింది. దీంతో ప్లే ఆఫ్ కు ఏ జట్టు వెళ్తాయి అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. పాయింట్లు పట్టికను బట్టి చూస్తే కొన్ని జట్లు వెళతాయి అన్న అభిప్రాయం కలుగుతున్నప్పటికీ సాంకేతిక అంశాలు ఇందుకు అడ్డు వస్తున్నాయి. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది.

టాప్ లో కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్..

ఈ ఏడాది ప్లే ఆఫ్ చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. పాయింట్లు పట్టికలో ఈ జట్టు ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్ ల్లో 9 విజయాలు సాధించగా, నాలుగు మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. మొత్తంగా 18 పాయింట్లతో టేబుల్ లో టాప్ లో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్ ల్లో ఏడు విజయాలు, ఐదు ఓటములతో.. మొత్తంగా 15 పాయింట్లుతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ ల్లో 7 విజయాలు, ఐదు ఓటములతో మొత్తంగా 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. లక్నో జట్టు 12 మ్యాచ్ ల్లో ఆరు విజయాలు, ఐదు ఓటములతో కలిపి మొత్తంగా 13 పాయింట్లుతో నాలుగో స్థానంలో ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్ ల్లో ఆరు విజయాలు, ఆరు ఓటములతో 12 పాయింట్లతో 5వ స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ జట్టు 13 మ్యాచ్ ల్లో ఆరు విజయాలు, ఏడు ఓటములతో 12 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. కోల్ కతా జట్టు 13 మ్యాచ్ ల్లో ఆరు విజయాలు ఏడు ఓటములు కలిపి 12 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టు కూడా ఆరు మ్యాచ్ ల్లో ఆరు విజయాలు, ఆరు ఓటములతో 12 పాయింట్లు కలిగి ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు, ఎనిమిది పరాజయాలతో.. ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన 12 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు, ఎనిమిది పరాజయాలతో.. ఎనిమిది పాయింట్లు కలిగి పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతున్నాయి.

ఆ జట్ల మధ్య కొనసాగుతున్న ఫైట్..

గుజరాత్ జట్టు మాత్రమే ఇప్పటి వరకు ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంది. మిగిలిన జట్లు హోరా హరీగా పోటీ పడుతున్నాయి. చెన్నై, ముంబై, లక్నో, రాజస్థాన్, కోల్ కతా, పంజాబ్, బెంగుళూరు జట్లు ప్లే ఆఫ్ రేస్ లో పోటీ పడుతున్నాయి. రాబోయే ఆరు రోజుల్లో జరగనున్న మ్యాచులు ప్రకారం పరిశీలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 90 శాతం అవకాశం ఉంది. చెన్నై జట్టు ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. ప్రస్తుతం 15 పాయింట్లు ఉండగా ఆ మ్యాచ్ లో విజయం సాధిస్తే 17 పాయింట్లు అవుతాయి. ముంబై జట్టు ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం 14 పాయింట్లు ఈ జట్టుకు ఉన్నాయి. ఒక్క మ్యాచ్ లో గెలిచినా 16 పాయింట్లకు చేరతాయి. ముంబైకి ప్లే ఆఫ్ అవకాశాలు 80 శాతం వరకు ఉన్నాయి. లక్నో జట్టుకు 61 శాతం, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 31 శాతం, పంజాబ్ జట్టుకు 21 శాతం, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 11 శాతం, కేకేఆర్ జట్టుకు ఆరు శాతం అవకాశం ఉంది. వీటిలో ఏ మూడు జట్లు క్వాలిఫై అవుతాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version