Homeజాతీయ వార్తలుModi vs KCR : కేసీఆర్‌కు వార్నింగ్‌ ఇచ్చిన మోదీ!

Modi vs KCR : కేసీఆర్‌కు వార్నింగ్‌ ఇచ్చిన మోదీ!

Modi vs KCR : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ నడిబొడ్డున నిలబడి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అధికారిక పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు వచ్చారు మోదీ. సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ రైలును ప్రారంభించారు. తర్వాత పరేడ్‌ గ్రౌండ్‌లో 13 ఎంఎంటీఎస్‌ రైళ్లను, జాతీయ రహదారులను ప్రారంభించారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్‌ రైల్వేలైన్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మోదీ మాట్లాడారు. అవినీతిపరులపై చర్యలు తప్పవని పరోక్షంగా కేసీఆర్, ఆయన కూతురు కవితను హెచ్చరించారు. అవినీతిపరులపై చర్య తీసుకోవాలా వద్దా అని నేరుగా వేదికపై నుంచి తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పేరు ప్రస్తావించకుండా కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. అవినీతిపరులంతా ఏకమవుతున్నారని ఆరోపించారు.

తెలుగులో ప్రసంగం ప్రారంభం..
ప్రియమైన సోదర, సోదరీమణులారా.. అంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు. సికింద్రాబాద్‌ – తిరుపతి మధ్య వందేభారత్‌ రైలును అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భాగ్యలక్ష్మి నగరాన్ని వేంకటేశ్వరస్వామి నగరంతో కలిపామని అన్నారు. ‘‘కరోనా, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం కారణంగా ప్రపంచం తిరోగమనంలోకి వెళ్లింది. భారత్‌ మాత్రం ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. బడ్జెట్‌లో ఈ ఏడాది మౌలిక వసతుల కల్పన కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించాం. రాష్ట్రంలో రూ.35 వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాం. జాతీయ రహదారుల విస్తరణకు భారీగా నిధులు కేటాయించాం. రాష్ట్రంలో భారీ టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మించుకున్నాం. టెక్స్‌టైల్‌ పార్క్‌తో రైతులు, కార్మికులకు ఎంతో ఉపయోగం. తొమ్మిదేళ్లలో భారత్‌ రూపురేఖలు సమూలంగా మార్చాం. దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చేశాం. రూ. 11 వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నాం’’ అని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదు
‘హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ సేవలు విస్తరిస్తున్నాం. ఒక్కరోజే 13 ఎంఎంటీఎస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. సికింద్రాబాద్‌ – మహబూబ్‌నగర్‌ రైల్వే డబ్లింగ్‌ పనులు పూర్తి చేశాం. తెలంగాణలో హైవే నెట్‌వర్క్‌ను వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్‌ – బెంగళూరు అనుసంధానాన్ని మెరుగుపరుస్తున్నాం. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణాన్ని భారీగా పెంచుతున్నాం. తెలంగాణలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదు. కేంద్రం ప్రగతి పనులు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం బాధపడుతోంది. తెలంగాణలో 12 లక్షల మందికి ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి కోసం మమ్మల్ని ఆశీర్వదించాలి’ అని కోరారు.

కుటుంబ పాలన కారణంగా అవినీతి..
రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు ప్రధాని. తండ్రి, కొడుకు, కుమార్తె.. అంతా అధికారంలో ఉంటారని పేర్కొన్నారు. కుటుంబ పాలన కారణంగా అవినీతి పెరుగుతోందని తెలిపారు. కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదన్నారు. కొంత మంది ప్రగతి నిరోధకులుగా మారారని, ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిజాయితీతో పనిచేసే వారంటే అవినీతిపరులకు భయమని పరోక్షంగా కేసీఆర్‌ను విమర్శించారు. ‘‘దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా? అవినీతిపై పోరాటం చేయాలా? వద్దా? అవినీతిపరుల విషయంలో చట్టం తనపని తాను చేసుకోవాలా? వద్దా?.. కుటుంబ పాలన నుంచి ఈ ప్రజలకు విముక్తి కలిగిస్తాం’’ అని ప్రధాని ప్రశ్నించారు.

మోదీ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. మోదీ మాట్లాడుతున్నంతసేపు ఆసక్తిగా విన్నారు. మోదీ.. మోదీ అంటూ సభా ప్రాంగణం మార్మోగింది. మొత్తంగా సభ విజయవంతం కావడం, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆశిస్తున్నట్లుగా ఈసారి మోదీ ప్రసగం సాగడంతో స్థానిక నేతల్లో సంతోషం కనిపిస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular