Homeఆంధ్రప్రదేశ్‌AP Mlc Elections : ఎమ్మెల్సీ ఫలితాలు.. వచ్చేసారి జగన్ పని అవుట్ యేనా..?

AP Mlc Elections : ఎమ్మెల్సీ ఫలితాలు.. వచ్చేసారి జగన్ పని అవుట్ యేనా..?

AP Mlc Elections : వరుస ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపికి ఎదురవుతున్న ఫలితాలు జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ను ఇచ్చాయి. వై నాట్ 175 అంటూ గొప్పలు పోయిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉన్న సీట్లును మిగిల్చుకోవడమే కష్టంగా మారుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు చేయి దాటిపోయి సైకిల్ కి ఓటు వేశారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకెంతకు పోతుందో అన్న ఆందోళన అధికార పార్టీలో వ్యక్తం అవుతోంది. వరుస ఎమ్మెల్సీ ఫలితాల్లో పార్టీకి ఎదురైన పరాభవం.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంకేతంగానే చూస్తున్నారు.

రాష్ట్రంలో వైసిపి సర్కార్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైసిపి.. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోను ఝలక్ తగిలింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ బరిలోకి దించిన పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో అధికారి పార్టీ ఆశలు పెట్టుకున్న ఏడో ఎమ్మెల్సీ సీటును కోల్పోవాల్సి వచ్చినట్లు అయింది. దీంతో ప్రస్తుతం రాజకీయాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మొన్నటివరకు వై నాట్ 175 అంటూ భీరాలు పలికిన వైసీపీ నేతలు వరుస ఫలితాలతో ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసిపి ఘోర పరాభవాన్ని చవి చూడడం, తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా ఒక ఎమ్మెల్సీ సీటును కోల్పోవాల్సి రావడంతో వైసీపీ సర్కార్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నట్లు అవుతోంది.

జగన్ పని అయిపోయినట్టేనా..?

వరుస ఫలితాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు జోరుగా మారుతున్నాయి అన్న చర్చ నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసిపి.. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోను అంతే స్థాయిలో విజయాలను నమోదు చేసింది. దీంతో వైసీపీ తమ ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతునిస్తున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని చెబుతూ వచ్చింది. అయితే రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంతో వైసీపీ సర్కార్ పని అయిపోయిందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వంపై వ్యక్తం అవుతోందని, ఆ వ్యతిరేకతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు రూపంలో కనిపించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, తాజా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోను వైసీపీకి నలుగురు ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వడాన్ని చూస్తే, వైసిపి ప్రభుత్వానికి రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ వైఖరితో ముందుకు వెళుతున్నారని, దీన్ని భరించలేని అనేకమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఆ అసంతృప్తి పతాక స్థాయికి చేరిన నలుగురు ఎమ్మెల్యేలే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఓటమి భయంతోనే..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపికి వ్యతిరేకంగా నలుగురు ఎమ్మెల్యేలే ఓటు వేసినప్పటికీ.. ఆ జాబితా ఇంకా పెద్దదిగానే ఉందన్న చర్చ నడుస్తోంది. మరో ఏడాది పాటు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లడం ద్వారా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే చాలామంది వెనక్కి తగ్గుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమని భావిస్తున్న సుమారు 40 మంది వరకు ఎమ్మెల్యేలు తెలుగుదేశంతోపాటు, జనసేన వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో గెలుపు పై నమ్మకం లేకపోవడం వల్లే జరుగుతోందని చెబుతున్నారు.

పట్టు సడలుతున్నట్లేనా..?

వైసిపి అంటే జగన్మోహన్ రెడ్డి.. జగన్మోహన్ రెడ్డి అంటే వైసిపి ప్రభుత్వం అన్నట్టుగా.. నాలుగేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితి నెలకొంది. ఇది చాలామంది సీనియర్ నేతలకు, ఎమ్మెల్యేలకు రుచించడం లేదు. దీంతో ఈ పార్టీలో ఉండడం కంటే మరో పార్టీలోకి వెళ్లడం మంచిదన్న భావనలో ఉన్న పలువురు ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే టిడిపి, జనసేన లోని ముఖ్య నేతలతో సంప్రదింపులు సాగిస్తున్నారు. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మరింత మంది ఎమ్మెల్యేలు గోడ దాటే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

క్షేత్రస్థాయి పరిస్థితి భిన్నం..

వైసీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు రూపంలో డబ్బులు వేస్తున్నాం కాబట్టి.. మళ్లీ గెలుస్తామని భావిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వం పట్ల అనేక వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దీనిని వైసీపీ పెద్దలు గ్రహించలేక భీరాలు పలుకుతున్నారు. ఇప్పటికీ అయినా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను సంతృప్తిపరిచే ప్రయత్నాలు చేయడంతో పాటు పార్టీ క్యాడర్ కు మేలు చేసేందుకు వైసిపి ప్రయత్నం చేయాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. లేకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version