Site icon OkTelugu

Janasena-BJP TDP: జనసేన-బీజేపీ పొత్తుల రాగం.. టీడీపీ మౌనం వెనుక కథేంటి?

Janasena-BJP TDP: ఏపీలో ఎలాగైనా సరే జగన్ ను గెలవనీయకూడదని జనసేనాని పవన్ కళ్యాణ్ పంతం పట్టాడు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని శపథం చేశాడు. ఇందుకోసం ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోనూ కలిసేందుకు అభ్యంతరం లేదన్నట్టుగా సంకేతాలు పంపారు. అయితే టీడీపీ మాత్రం ఈ పొత్తుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముందుగా పవన్ పై‘వన్ సైడ్ లవ్’ ప్రయోగించిన చంద్రబాబు ఇప్పుడు పవనే సంకేతాలు పంపుతున్నా స్పందించడం లేదు. ఏపీలో రాజకీయంగా బలపడేందుకే చంద్రబాబు యోచిస్తున్నారు.  టీడీపీ పొత్తు కోసం తమతో కలిసిరావాలని  జనసేన-బీజేపీ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ టీడీపీ మౌనం మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

చంద్రబాబు  గతంలో జగన్ ను ఓడించేందుకు కలిసి రావాలని.. ప్రతిపక్షాలందరూ ఒక్కటి కావాలని పిలుపునిచ్చాడు. 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు బలమైన జగన్ ను ఎదురించడానికి ప్రతిపక్షాలను కలుపుకుపోవాలని భావించారు. కానీ ఇప్పుడు జనసేన, బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు అందినా.. చంద్రబాబు మాత్రం అధికారికంగా నోరు మెదపడం లేదు.

జనసేన ఆవిర్భావ దినోత్సవంలో ఓట్లు చీలనివ్వనంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన అధికార వైసీపీకి చమటలు పట్టించింది. అప్పుడే దమ్ముంటే ఒంటరిగా పోటీచేయాలని పవన్ కు, చంద్రబాబుకు సవాల్ చేసింది. కానీ ఓటమి భయంతోనే వైసీపీ ఇలా ప్రతిపక్షాలను విడగొట్టాలని చూస్తోందని జనసేన కౌంటర్ ఇచ్చింది.

పొత్తులపై టీడీపీ పెద్దగా స్పందించకపోవడం..  సంకేతాలు పంపకపోవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘మూడు ఆప్షన్లు’ ఎంచుకున్నారు. జనసేన ఒంటరిగా పోటీచేయడం.. బీజేపీతో కలిసి జనసేన పోటీచేయడం.. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి బరిలోకి దిగడం.. ఇలా మూడు అవకాశాలను పరిశీలిస్తున్నారు. బీజేపీ లేకుండా కేవలం టీడీపీతో మాత్రమే జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.

ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉంది.  దీంతో టీడీపీ కూడా అప్పటి బలం ఆధారంగా పొత్తు పెట్టుకుందామని జనసేన-బీజేపీని అవైడ్ చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి నుంచే కూటమిగా వెళితే వైసీపీని చావుదెబ్బ తీయవచ్చని యోచిస్తున్నారు.

బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తుకు ఆసక్తి చూపించడం లేదు. ఒంటరిగా పోటీచేస్తే బీజేపీ సీట్లు సాధించడం కష్టమే. జనసేనతో వెళితే కాస్తో కూస్తో సీట్లు వస్తాయి. ఇక టీడీపీతో కలిస్తే అధికారం గ్యారెంటీ. కానీ కేంద్రంలో జగన్ తో బీజేపీ సాన్నిహిత్యం వల్ల ఇక్కడ రాష్ట్ర బీజేపీ టీడీపీతో కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్న టాక్ నడుస్తోంది.ఇదే జనసేనకు మైనస్ అవుతోంది.

మహానాడు తర్వాత టీడీపీకి కొండంత ధైర్యం వచ్చింది. టీడీపీకి అధికారంపై ఆశ కలిగింది. ఒంటరిగా వెళితే గెలుపు ఖాయమన్న ధీమా వచ్చింది. దీంతో జనసేన, బీజేపీ పొత్తులపై ఎంత కన్నుగీటినా టీడీపీ మాత్రం టెంప్ట్ కావడం లేదు. వైసీపీపై వ్యతిరేకతనే తమను గెలిపిస్తుందని.. రాష్ట్రం బాగుపడలాంటే టీడీపీని గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఫీడ్ బ్యాక్ వచ్చిందట.. వైసీపీకి ప్రత్యామ్మాయం ఏపీలో టీడీపీనే కావడంతో ఇప్పుడా పార్టీ ఒంటరిగా వెళ్లడమే బెటర్ అని.. అనవసరంగా పలు సీట్లను జనసేన, బీజేపీకి ఇచ్చి పార్టీలోనే అసమ్మతి రాజేసుకోవడం వేస్ట్ అని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. టీడీపీ అనూహ్యంగా సైలెంట్ కావడంతో జనసేన-బీజేపీ నేతలు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

Exit mobile version