Pawan Kalyan – Chandra Babu: ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే ఏపీ రాజకీయాలు మరింత రంజుగా మారాయి. అధికార పక్షం నిష్క్రియా పరత్వం, ప్రతిపక్షాల దుందుడుకుతనం మొత్తానికి మీడియాకు కావలసినంత స్టఫ్ ఇస్తున్నాయి.. బుధవారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను పోలీసులు ఆదుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అలజడి చెలరేగింది.. అంతకుముందే నెల్లూరు, గుంటూరు ఘటనలను సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటి విడుదల చేసింది. దీని ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం కుదరదు. దీనిని సవాల్ చేస్తూ నిన్న చంద్రబాబు నాయుడు కుప్పం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ అక్కడ పోలీసులు వెనక్కి తగ్గలేదు. టిడిపి కార్యకర్తలను చెదరగొట్టేందుకే ప్రయత్నించారు. ఫలితంగా ప్రశాంతంగా ఉన్న కుప్పం వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

పవన్ సంఘీభావం
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుప్పం ఘటనపై స్పందించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజమహేంద్రవరంలో భారీ ఎత్తున సమావేశం నిర్వహించారు.. అదే రోజున కనుక చంద్రబాబు నాయుడు ఇలాంటి జీవో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించేవారా అని పవన్ ప్రశ్నించారు. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందనే సామెత తీరుగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉందని పవన్ దెప్పి పొడిచారు. అంతేకాదు తాను విశాఖ జిల్లాలో పర్యటించినప్పుడు బయటకు రాకూడదు, మాట్లాడకూడదు, కారులో నుంచి చూడకూడదు అని ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిరసన తెలియజేస్తాయని, రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చిందని పవన్ తన ట్విట్ లో ద్వారా పేర్కొన్నారు.

పొత్తు కుదురుతుందా?
నిన్న కుప్పంలో జరిగిన ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ స్పందించడంతో టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.. గత అక్టోబర్లో విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు పోలీసులు ఇదే స్థాయిలో అడ్డుకున్నారు. అప్పుడు దీనిని చంద్రబాబు నాయుడు ఖండించారు. జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు రకరకాల ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. తాజాగా పవన్ కళ్యాణ్ కుప్పం ఘటనకు సంబంధించి స్పందించడంతో వైఎస్ఆర్సిపి నాయకులు రెచ్చిపోతున్నారు. ఇద్దరి మధ్య మళ్ళీ పొత్తు కుదిరిందని ఆరోపిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీలు ఇప్పటివరకు ఎటువంటి పొత్తులు కుదుర్చుకోలేదు.. అయితే ఢిల్లీలో ఉన్న సమాచారం ప్రకారం అయితే 2014 పొత్తులనే పునరావృతం చేస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. అయితే ఏపీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ తెరపైకి వస్తోంది. ఇందులో మెజారిటీ జనసేన నాయకులు కూడా అదే నిర్ణయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ దీని గురించి ఏమనుకుంటున్నారో?!



