Tamarind Kallu: బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా.. ఆ చెట్టుకు కల్లు అందులో భాగమేనా..!?

బ్రహ్మంగారి కాలజ్ఞానం.. ప్రస్తుత జనరేషన్‌లో చాలా మందికి దీనికి గురించి తెలియదు కానీ, 90వ దశకం వరకు చాలా మందికి దీనిపై అవగాహన ఉంది. భవిష్యత్‌లో జరుగబోయేవన్నీ ఈ కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్రస్వామి తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : October 21, 2024 10:43 am

Tamarind Kallu

Follow us on

Tamarind Kallu: కాలజ్ఞానం.. అనగానే గుర్తుకువచ్చేది శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. 1990 వ దశకం వారందరికీ ఆయన గురించి, ఆయన కాలజ్ఞానం గురించి తెలుసు. ప్రస్తుత తరం వారికి దీనిపై పెద్దగా అవగాహన లేదు. ఈ కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్‌ గురించి వివరించారు. చాగంటిలో నంది పెరుగుతుందని, పంది కడుపున నంది పుడుతుందని, బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ తాకుతుందని, మహిళలు రాజ్యమేలుతారని, ఇలా అనేక విషయాలు వెల్లడించారు. వీటిలో కొన్ని ఇప్పటికే నిజమయ్యాయి. అంటు వ్యాధుల గురించి, దేశాల మధ్య యుద్ధాల గురించి కూడా ఈ కాలజ్ఞనంలో ఉంది. దీంతో చాలా మంది నిజమయిన వాటిని చూసి ఆందోళన చెందుతున్నారు. పూజలు చేస్తున్నారు. ఆందోళన ఎందుకంటే.. ఇదే కాలజ్ఞానంలో భూమి అంతం గురించి కూడా బ్రహ్మంగారు వెల్లడించారు. కోవిడ్‌ మహమ్మారి గురించి కూడా కాలజ్ఞానంలో ఉంది. ఈ విషయం అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో చాలా మందికి కాలజ్ఞానం గురించి తెలిసింది. ఇదిలా ఉంటే.. జగిత్యాల జిల్లాలో ఇప్పుడు కాలజ్ఞానంలో చెప్పిన ఓ ఘటన తాజాగా జరిగింది.

చింత చెట్టుకు కల్లు..
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన కాలజ్ఞానం నిజమైంది. తెలంగాణలో తాటికల్లు చాలా ఫేమస్‌. ఈతకల్లు కూడా లభిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో కొబ్బరి కల్లు, కర్జూర కల్లు, వేప కల్లు కూడా తీస్తున్నారు. కానీ, చింతచెట్టుకు కల్లు కారడం ఎప్పుడూ వినలేదు. కనలేదు. కానీ, ఈ విషయాన్ని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు.ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు జగిత్యాల జిల్లా ఎండపల్లిలో చింతచెట్టుకు కల్లుకారుతోంది. దీంతో ఇదంతా అమ్మవారి మాయే అని కొందరు పూజలు చేస్తున్నారు. గ్రామంలోని ఓ కూడలి వద్ద ఉన్న సుమారు వంద ఏళ్లకుపైబడిన చింతచెట్టు నుంచి అకస్మాత్తుగా ఓ రకమైన ద్రవం కారుతోంది. దీనిని గమనించి గ్రామస్తులు దానిని కల్లుగా భావించారు. చెట్టుకు బాటిల్‌ కట్టి కల్లు పడుతున్నారు.

చెట్టుకింద ఏటా పూజలు..
ఇదిలా ఉంటే.. ఈ చింతచెట్టు కింద ఏటా వినాయక చవితి, దసరా సందర్భంగా విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రి పూజలు చేస్తారు. ఈ ఏడాది కూడా వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహం ప్రతిష్టించి తొమ్మిది రోజులు పూజలు చేశారు. ఇటీవల దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విగ్రహం నెలకొల్పి పూజలు చేశారు. అయితే దుర్గామాత ఉత్సవాలకు ముందు మండపం వేయడానికి చెట్టు కొమ్మ అడ్డుగా ఉండడంతో దానిని నరికివేశారు.

నరికేసిన కొమ్మ నుంచే..
కొమ్మ నరికి 20 రోజులకు పైనే అవుతుంది. ఇన్ని రోజుల తర్వాత నరికివేసిన కొమ్మ నుంచే ఇప్పుడు కల్లు కారుతోంది. ఈ విషయం గుర్తించిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పూజలు చేస్తున్నారు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్లు చింతచెట్టుకు కల్లు పారుతోందని చర్చించుకుంటున్నారు. మరికొందరు కలియుగాంతానికి ఇది సంకేతమని, కొన్నేళ్లలోనే యుగాంతం ప్రారంభం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇదంతా దుర్గామాత మహిమే అని పేర్కొంటున్నారు.