Jaahnavi Kandula: అమెరికా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన భారతీయ విద్యార్థిని జాహ్నవి మృతి కేసులో అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పుపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. జాహ్నవి మరణానికి కారణమైన అధికారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని తప్పు పట్టింది. సరైన ఆధారాలు లేనందున అధికారిపై క్రిమినల్ అభియోగాలు మోపడం లేదని వాషింగ్టన్ స్టేట్లోని కింగ్కౌంటీ ప్రాసిక్యూటర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ కీలక ప్రకటన చేసింది. తీర్పును సమీక్షించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని సియటెల్లోని భారత దౌత్య కార్యాలయం ధ్రువీకరించింది.
భారత దౌత్య కార్యాలయం నివేదిక ఇలా..
‘దురదృష్టకర రీతిలో రోడ్డు ప్రమాదంలో భారత విద్యార్థిని జాహ్నవి కందుల మృతిచెందింది. ఈ కేసులో కింగ్ కౌంటీ అటార్నీ ప్రాసిక్యూషన్ దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అయితే ఈ విషయంలో బాధిత కుటుంబంతో టచ్లో ఉన్నాం. న్యాయం జరిగే వరకు అన్నిరకాలుగా సహకారం అందిస్తాం’ అని దౌత్య కార్యాలయం తెలిపింది. ఈ కేసులో తగిన పరిష్కారం కోసం సీయటెల్ పోలీసులతో, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. కింగ్ కౌంటీ ప్రాసిక్యూషన్ తీర్పుపై సమీక్ష కోసం ఇప్పటికే సీటెల్ సిటీ అటార్నీ కార్యాలయానికి సిఫార్సు చేశామని వెల్లడించింది. సీయటెల్ పోలీసుల విచారణ, కేసులో పురోగతిని పరిశీలిస్తామని తెలిపింది.
ఉన్నత చదువులకు వెళ్లి..
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) అమెరికాలోని సియటెల్లో మాస్టర్స్ చేస్తోంది. గతేడాది జనవరి 23న రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ వేగానికి ఆమె వంద అడుగుల ఎత్తు ఎగిరిపడి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. ఆ సమయంలో వాహనం నడుపుతున్న కెవిన్ డేవ్ నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతిచెందినట్లు నిర్ధారణ అయింది.
చులకనగా మాట్లాడిన పోలీస్ ఆఫీసర్..
ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన సమయంలో సియటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్ట్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ జాహ్నవి మృతిపై చులకనగా మాట్లాడాడు. ప్రమాదం గురించి పై అధికారికి సమాచారం ఇస్తూ జాహ్నవి జీవితానికి పరిమితమైన విలువ ఉందని నవ్వులు చిందించాడు. పరిహారంగా చెక్ ఇస్తే పరిపోతుందని పేర్కొన్నాడు. చిన్న వయసులో చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్ల పరిహారం చాలని హేళన చేశాడు. ఈ వీడియోతో బయటకు రావడంతో దుమారం రేగింది. అయితే తాను అలా మాట్లాడలేదని, తర్వాత వివరణ ఇచ్చాడు ఆర్డరర్. జాహ్నవి మృతికి కారణమైన కెవిన్కు అనుకూలంగా, తప్పంతా జాహ్నవిదే అన్నట్లు నివేదిక కూడా ఇచ్చాడు.