Aditya L-1 : చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన ఉత్సాహంలో ఉన్న ఇస్రో… మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడి గుట్టుమట్లపై అధ్యయనం చేయడానికి సెప్టెంబరు 2న సోలార్ మిషన్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. దీని సాయంతో సౌర కరోనాతో పాటు సూర్యుడి నుంచి ప్రసరించే అతి శక్తిమంతమైన కాంతి కిరణాల ప్రభావం, సౌర మండలంలోని గాలులపైనా అధ్యయనం చేయనున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సెప్టెంబరు 2న పీఎస్ ఎల్వీ-సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య-ఎల్1 శాటిలైట్ను నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్రావు శాటిలైట్ కేంద్రం నుంచి షార్కు తీసుకొచ్చి క్లీన్ రూమ్లో ఉంచి పలు కీలక పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సౌర తుఫాన్ల సమయంలో..
సౌర తుఫాన్ల సమయంలో వెలువడే రేణువులతో భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు గతంలోనే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో రేణువులతో పాటు కాంతి మండలం (ఫొటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)లపై ఆదిత్య ఎల్-1తో అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించనున్నారు. 1,475 కిలోల బరువు కలిగిన ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహాన్ని పీఎస్ ఎల్వీ-సీ57 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఇందులోని పేలోడ్ల బరువు 244 కిలోలు కాగా.. మిగిలిన 1,231 కిలోలు ఉపగ్రహాన్ని సూర్యుడివైపు తీసుకెళ్లడానికి అవసరమైన ద్రవ ఇంధనంతో నింపి ఉంటుంది. తొలుత ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టిన తర్వాత భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ పాయింట్-1(ఎల్-1)లోకి పంపడానికి 109 నుంచి 177 రోజులు పడుతోంది. అక్కడినుంచి గ్రహణాలు తదతర అవరోధాలేవీ లేకుండా సూర్యుడిపై జరిగే మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు.
ఆరు పే లోడ్లు
ఈ ఉపగ్రహంలో ఆరు పేలోడ్లు అమర్చి పంపుతున్నారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు సూర్యుడి కరోనా విస్తరించి ఉంటుంది. ఈ కరోనాలో ఉష్ణోగ్రత దాదాపు 10లక్షల కెల్విన్ డిగ్రీలు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత 6వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుందంటున్నారు. కరోనాలో వేడి విపరీతంగా పెరిగిపోతుండడానికి కారణం శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. అందుకే ఆదిత్య-ఎల్1తో పరిశోధనలు చేయనున్నారు.