Telangana Politics :
తెలంగాణ మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని చోట, అధికారాన్ని దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న తీరు సామాన్య ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. “రాజకీయాలంటేనే ఇంతేనా?” అనే విరక్తి ప్రజల్లో కలుగుతోంది.
ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న పార్టీలు, పీఠం దక్కించుకునే సమయానికి మాత్రం ఒక్కటవుతున్నాయి. జాతీయ స్థాయిలో ఉప్పు-నిప్పులా ఉండే కాంగ్రెస్, బీజేపీలు కొన్ని చోట్ల చేతులు కలపడం.. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్, బీజేపీలు అధికారం పంచుకోవడం రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయనడానికి నిదర్శనం. ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఓటు వేసిన ప్రజలు, తమ ప్రతినిధులు ప్రత్యర్థి పార్టీలతో కలవడం చూసి మోసపోయామని భావిస్తున్నారు. స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యానికి పునాదులు. కానీ ఇక్కడ జరిగే ‘అడ్డదారులు’ ఆ పునాదులనే బలహీనపరుస్తున్నాయి.
ఓట్ల కోసం జనం కొట్లాడుకోవడం, అధికారం కోసం నాయకులు పొట్లాడుకోవడం కాకుండా.. నైతికతతో కూడిన రాజకీయం ఎప్పుడు వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీలు తమ స్వార్థం పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది.
