Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన భార్య పేరు మీద పది ప్లాట్లు.. ఖానామెట్ ఏరియాలో జీ+5 కమర్షియల్ భవనం.. మూసాపేట.. ఆంజనేయ నగర్ ప్రాంతంలో జి ప్లస్ త్రీ బిల్డింగ్.. నాలుగు రెసిడెన్షియల్ ప్లాట్లు.. మొత్తంగా 28.14 కోట్ల ఆస్తులు.. ఇవేవో సెలబ్రిటీ సంపాదించిన సంపద కాదు. పోనీ ఎవరైనా క్రికెటర్ అవకాశాల ద్వారా వెనకేసుకున్న సొమ్ము కాదు. ఇదంతా అవినీతి అధికారి.. లంచాల బాగోతం.
తెలంగాణ ఏసీబీ అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈసారి ఏకంగా అత్యంత భయంకరమైన అవినీతి అనకొండలాంటి అధికారిని పట్టేస్తున్నారు. ఆయన దగ్గరనుంచి పైన ఉదహరించిన ఆస్తులను గుర్తించారు. అవినీతిలోనే అనకొండ లాంటి ఈ అధికారి పేరు ముత్యం వెంకటరమణ. ట్రాన్స్కో డిపార్ట్మెంట్లో డీఈ గా పని చేస్తున్నారు. ఈయన లంచాలు ఇవ్వకుండా ఏ పని కూడా చేయరు. పైగా ప్రతి దానికి ఒక రేట్ ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫిక్స్ చేసిన రేట్ ప్రకారం ఇస్తేనే పనిచేస్తారు. లేకపోతే అంతే సంగతులు.
వెంకటరమణ మీద విపరీతంగా ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన బంగారాన్ని.. నగదును.. విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. అంతేకాదు వెంకటరమణ బంధువుల గృహాలలో కూడా తనిఖీలు మొదలుపెట్టారు. కొద్దిరోజులుగా వెంకటరమణ మీద ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. ఆయన బాధితుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మెరుపు దాడులు చేశారు. ఆయన ఆస్తులను చూసిన ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. ఇటీవల కాలంలో అవినీతి అనకొండలను తెలంగాణ ఏసీబీ అధికారులు పట్టుకుంటున్నారు. వారు సంపాదించిన అక్రమ ఆస్తుల వివరాలను బయటపెడుతున్నారు.ఏసీబీ అధికారులు ఈ స్థాయిలో దాడులు చేస్తున్నప్పటికీ కొంతమంది అధికారులు ఇంకా మారడం లేదు. లంచాల కోసం కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. అంతేకాదు పని కోసం వచ్చిన ప్రజలను జలగల మాదిరిగా పట్టిపీడిస్తున్నారు. ఏసీబీ విస్తృతంగా దాడులు చేస్తున్నప్పటికీ అధికారుల తీరు మారడం లేదంటే వారు లంచాల కోసం ఏ విధంగా మరిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి అధికారులను సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తేనే.. మిగతా అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారని ప్రజలు అంటున్నారు.

