POK protests : పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికీ ఆందోళనలు తగ్గలేదు.. ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో పాకిస్థాన్ ఆధిపత్యం పూర్తిగా తగ్గిపోవాలని.. తమకు జమ్ము కాశ్మీర్ మాదిరిగా ఎన్నికలు నిర్వహించాలని.. తమకు స్వేచ్ఛను ప్రసాదించి.. సానుకూల జీవితాన్ని కొనసాగించే విధంగా చూడాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ తొలగించినప్పటికీ.. తమ మీద ఆంక్షలు విధించినప్పటికీ అక్కడి ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు.
మొదట్లో ఈ నిరసనలు హింసాత్మక విధానంలో జరిగాయి. పాకిస్థాన్ ఆర్మీ రంగంలోకి దారుణంగా కాల్పులు జరిపింది. చిన్నపిల్లలు.. గర్భవతులు ఎక్కువగా చనిపోయారు. ఈ హింస పట్ల అంతర్జాతీయ సమాజం దాయాది మీద తీవ్రస్థాయిలో మండిపడింది. ఇటువంటి విధానాలు ఏమాత్రం సరికావని బ్రిటన్ అత్యున్నత సభ హెచ్చరించింది. ప్రపంచంలో స్వేచ్ఛను కోరుకునే సంస్థలు.. మానవ హక్కులను పరిరక్షించే మేధావులు పాకిస్తాన్ దుశ్చర్యను తీవ్రస్థాయిలో ఖండించారు. అంతేకాదు ఇలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేదని స్పష్టం చేశారు.
అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఎందుకంటే అక్కడ మొహరించిన పాకిస్తాన్ ఆర్మీ సొంత దేశానికి వెళ్లిపోయింది. అక్కడి పోలీసులు ప్రజల మీద దాడులు చేసేందుకు ఏమాత్రం ముందుకు రావడం లేదు. కర్రలు ఎత్తబోము.. తుపాకులు సంధించబోము అంటూ వారు స్పష్టం చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరోవైపు అక్కడి ప్రజలు శాంతియుత విధానంలో నిరసన పాటిస్తున్నారు. పోలీసుల మీద రాళ్లు విసరడం లేదు. ఆర్మీ ని తిట్టడం లేదు. వీధులలో హింసాత్మక ఘటనలకు పాల్పడటం లేదు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా.. ఎవరినీ నొప్పించకుండా శాంతియుత విధానంలో నిరసన పాటిస్తున్నారు.. ఈ పరిణామంతో పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.
అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఇన్నాళ్లపాటు సాగించిన పెత్తనానికి చరమగీతం పాడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ గుప్పెట్లో పెట్టుకున్న ఆ. స్థానాలను కూడా అక్కడి పార్లమెంట్ నిర్ణయానికే వదిలేయాలని ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
