Manchu Manoj adopts children : మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని ఏర్పాటు చేసుకొని , మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో మంచు మనోజ్. మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు రొటీన్ కి భిన్నంగా ఈయన చేసిన సినిమాలంటే యూత్ ఆడియన్స్ కి తెగ ఇష్టం , ముఖ్యంగా ఆయన చిత్రాల్లోని పాటలకు ఉండే క్రేజే వేరు. సినిమాలు చేయడమే కాదు , ఈ హీరోకి సామజిక స్పృహ కూడా ఎక్కువే. సమాజం లో ఎదురయ్యే ప్రతీ చిన్న సమస్యపై స్పందించే గుణం , నలుగురికి సహాయం చెయ్యాలనే గొప్ప మనస్సు, ఇవన్నీ మనోజ్ కి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టాయి. సోషల్ మీడియా లో మంచు ఫ్యామిలీ మొత్తం పై ట్రోల్స్ పడినప్పటికీ మంచు మనోజ్ మీద ఒక్క ట్రోల్ కూడా పడదు, అందుకు ముఖ్య కారణం ప్రవర్తించే తీరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పుడు మరోసారి ఆయన ఉదార స్వభావాన్ని చాటుకొని , నెటిజెన్స్ చేత శభాష్ అని అనిపించుకుంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేడు ఆయన తన సతీమణి భూమా మౌనిక తో కలిసి ‘ఐక్య ధైర్య సేన సమితి’ అనే సేవా సంస్థను ప్రారంభించారు. మే 20 న మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా , ఆయన అభిమానులు హైదరాబాద్ లోని KPHB లో జన్మదిన వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు మనోజ్ తన భార్య మౌనిక తో కలిసి హాజరయ్యారు. అంతే కాకుండా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. మంచు మనోజ్ దంపతులు ఏర్పాటు చేసిన సేవ సంస్థను స్వయంగా నవీన్ యాదవ్ ప్రకటించాడు. ఈ ట్రస్ట్ ని ప్రారంభించిన సందర్భంగా , మొదటి రోజే 5 మంది పిల్లలను దత్తత తీసుకుంటున్నట్టు మనోజ్ అధికారిక ప్రకటన చేశాడు .
ఆ పిల్లల విద్యాబ్యాసం దగ్గర నుండి , వాళ్లకు అవసరం అయ్యే ప్రతీ ఒక్కటి సమకూరుస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు మనోజ్. తమ సేవ కార్యక్రమాలను కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం చేయడం లేదు , త్వరలోనే ప్రతీ పట్టణం లోనూ ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. ఇది రాజకీయం కోసం చేయడం లేదు , ఈ సంస్థ మా ఇద్దరిది మాత్రమే కాదు, మానవత్వాన్ని విశ్వసించే ప్రతీ ఒక్కరిది అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్. మరి రాబోయే రోజుల్లో ఈ సంస్థ ద్వారా మనోజ్, మౌనిక ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయబోతున్నారో చూడాలి.