Amaravati Capital Issue : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. “మావిగన్ను ఒప్పుకునే వారు నాకు ఓటు వేస్తారు.. అమరావతిని ఒప్పుకునే వారు చంద్రబాబుకు ఓటు వేస్తారు” అని ఆయన చేసిన వ్యాఖ్యలు, రాబోయే ఎన్నికలను రాజధాని అంశం చుట్టూ తిప్పే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.
అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే… పార్లమెంట్ చట్టబద్ధ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన అమరావతి రాజధానిని మళ్లీ మార్చే రాజకీయ, చట్టపరమైన అవకాశం జగన్కు ఉందా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కేంద్రం అటువంటి నిర్ణయానికి అంగీకరిస్తుందా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇప్పటివరకు కనిపించడం లేదు.
మరోవైపు జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ రెండూ అమరావతినే రాజధానిగా అంగీకరిస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో జగన్ మళ్లీ కొత్త రాజధాని ఆలోచనను ముందుకు తీసుకురావడం ఎంతవరకు ఆచరణ సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ తన వాదనలో “నేను అమరావతికి వ్యతిరేకం కాదు… అక్కడ జరిగిన అవినీతికి మాత్రమే వ్యతిరేకం” అని చెబుతున్నారు. అదే సమయంలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామని చెబుతూనే, గతంలో భూములు ఇవ్వొద్దని చెప్పిన విషయాన్ని రాజకీయ ప్రత్యర్థులు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అమరావతి విషయంలో వైసీపీ అసలు వైఖరి ఏమిటనే సందేహం మరింత బలపడుతోంది.
ఇంకా ఒక కీలక అంశం… గతంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల సిద్ధాంతాన్ని ప్రకటించింది. అందులో విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ అంశాన్ని పక్కనబెట్టి “మావిగన్” అనే కొత్త నినాదాన్ని ముందుకు తేవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది కొత్త రాజకీయ వ్యూహమా? లేక గత నిర్ణయాల నుంచి వైదొలిగిన సంకేతమా? అనే చర్చ సాగుతోంది.
రాజధాని అంశం ఇప్పటికే ఎన్నో రాజకీయ, చట్టపరమైన మలుపులు చూసింది. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ఆందోళనలు, కోర్టు తీర్పులు, కేంద్ర ప్రభుత్వ వైఖరి వంటి పరిణామాల తర్వాత మళ్లీ కొత్త రాజధాని ప్రతిపాదనను ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారనేది ఎన్నికల్లో కీలక అంశంగా మారే అవకాశం ఉంది.
ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే, “మావిగన్ వర్సెస్ అమరావతి” అనే పోరును ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ వ్యూహం ఆయనకు రాజకీయంగా లాభం చేకూరుస్తుందా? లేక ఇప్పటికే స్థిరపడిన అమరావతి అంశంపై మళ్లీ వివాదం సృష్టించడం ద్వారా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
రాజధాని వంటి సున్నితమైన అంశంలో ప్రజలు భావోద్వేగాలకన్నా ఆచరణ సాధ్యత, చట్టబద్ధత, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలనే ఎక్కువగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో రాజధాని రాజకీయాలు మరోసారి కీలక పాత్ర పోషించబోతున్నాయి.
మావిగన్ వాదనతో ఓటమిని ముందుగానే ఖాయం చేసుకున్న జగన్.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.


