India vs pakistan : టి20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. బ్యాటింగ్లో అదరగొట్టింది.. బౌలింగ్లో సత్తా చూపించింది. ఫీల్డింగ్లో మెరుపులు మెరిపించింది. తద్వారా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. సూపర్ 8 దశకు సగర్వంగా వెళ్ళింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 175 పరుగులు చేసింది. పాకిస్తాన్ జట్టు కెప్టెన్ టాస్ గెలిచి.. బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ నుంచి అంతగా సహకారం లేకపోయినప్పటికీ టీమిండియా బ్యాటర్లు సత్తా చూపించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 0 పరుగులకు అవుట్ అయినప్పటికీ.. మరో ఓపెన్ ఇషాన్ కిషన్ (77) అదరగొట్టాడు. 40 బంతులలో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో సత్తా చూపించాడు. సూర్య కుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ(25), శివం దుబే (27) తమ స్థాయి ఆట తీరు ప్రదర్శించడంతో టీమిండియా 175 పరుగులు చేసింది. సయీం ఆయుబ్ మూడు వికెట్లు పడగొట్టాడు.
176 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఏ దశలో కూడా విజయానికి చేరువుగా ఉన్నట్టు కనిపించలేదు. ఓపెనర్లు ఫర్హాన్ (0), ఆయుబ్ (6), కెప్టెన్ సల్మాన్ ఆఘా(4), బాబర్ అజాం(5) ఇలా కీలక ఆటగాళ్లు దారుణమైన ఆట తీరు ప్రదర్శించడంతో పాకిస్తాన్ జట్టు ఏ దశలో కూడా కోలుకోలేకపోయింది .
ఈ క్రమంలో ఉస్మాన్ ఖాన్ (44), షాహిన్ ఆఫ్రిది (23) భారత బౌలర్లను కాస్త ప్రతిఘటించడంతో పాకిస్తాన్ 114 పరుగులు చేయగలిగింది. లేకపోతే ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. పాకిస్తాన్ జట్టులో ఏకంగా ముగ్గురు ప్లేయర్లు 0 పరుగులకు అవుట్ అయ్యారు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని భారత బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. హార్దిక్ పాండ్యా, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. కులదీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ అందుకున్నారు.
ఈ మ్యాచ్ కంటే ముందు అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత జట్టుతో ఆడబోమని పాకిస్తాన్ ప్రకటించింది. ఆ తర్వాత రకరకాల ఒత్తిళ్లు ఎదురు కావడంతో పాకిస్తాన్ జట్టు వెనక్కి తగ్గక తప్పలేదు. చివరికి భారత జట్టుతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. మ్యాచ్ ఆడినప్పటికీ పాకిస్తాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఏకంగా 61 పరుగుల తేడాతో ఓటమిపాలైందంటే.. ఆ జట్టు ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఐసీసీ నిర్వహిస్తున్న మేజర్ టోర్నీలలో మాత్రమే టీమిండియా, పాకిస్తాన్ తలపడుతున్నాయి. అయినప్పటికీ ఆ టోర్నీలలో టీమ్ ఇండియాదే పై చేయి సాగుతూ ఉండటం విశేషం.