Gulf war impact on economy : గల్ఫ్లో జరుగుతున్న యుద్ధం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. ప్రధానంగా ఇంధన సరఫరా ప్రభావితమైంది. అనేక దేశాలు ఉత్పాదనలు, ఎగుమతులు ఆగాయి. ఇంత సంక్షోభంలో కూడా భారత్ తట్టుకుని నిలబడింది. చమురు కొరత లేదు. కొంత ప్యానిక్ ఉన్నది. గ్యాస్ సరఫరా కాస్త ఆలస్యం అవుతోంది. ఓవరాల్గా ఎక్కడా అత్యంత సంక్షోభం లేదు.
ప్రపంచ దేశాల్లో కఠిన ఆంక్షలు..
యుద్ధం ప్రారంభమైన వెంటనే అనేక దేశాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. వాటి వ్యూహాలు పొదుపు నుంచి కఠిన నియంత్రణ వరకు విస్తరించాయి. వియత్నాం వర్క్–ఫ్రం–హోం విధానాన్ని అమలు చేసి, పెట్రోల్ వినియోగంపై కఠిన ఆంక్షలు విధించింది. ప్రజలు సైకిళ్లపై ప్రయాణించాలని సూచించింది. మయన్మార్ ఆడ్–ఈవెన్ నంబర్ ప్లేట్ల విధానాన్ని అమలు చేసింది. ఒక రోజు బేసి సంఖ్య గల వాహనాలు, మరో రోజు సరి సంఖ్య గల వాహనాలు మాత్రమే రోడ్డెక్కాయి. కంబోడియా పెట్రోల్ బంకులను పూర్తిగా మూసివేసి, ఇంధన పంపిణీని నియంత్రణలోకి తీసుకుంది. లావోస్ కార్యాలయ సమయాలను మార్చి, షిఫ్టుల వ్యవస్థను అమలు చేసి పీక్ అవర్స్లో వినియోగం తగ్గించింది. ఆఫ్రికా దేశం కెన్యా చమురును రేషన్ షాపుల ద్వారా మాత్రమే పంపిణీ చేస్తోంది. ఎగుమతులను పూర్తిగా నిలిపివేసి, దేశీయ అవసరాలకు మాత్రమే పరిమితం చేసింది. న్యూజిలాండ్ వారంలో ఒక రోజు వాహనాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించి, అనేక విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈజిప్ట్ గల్ఫ్ దేశాలకు సమీపంలో ఉన్నా యుద్ధానికి దూరంగా ఉంటూ, విద్యుత్ వినియోగం తగ్గించింది. బిల్బోర్డ్స్, అనవసర లైటింగ్ను మూసివేయాలని ఆదేశించింది. ఇక పాకిస్తాన్ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచి, వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. ఇది సామాన్యుడిపై భారీ భారం మోపింది.
భారత్ వ్యూహాత్మక సిద్ధత..
ఈ గందరగోళంలో భారత్ మాత్రం ప్రశాంతంగా ఉంది. చమురు లభ్యతలో ఎలాంటి తీవ్ర ఇబ్బంది లేదు, కేవలం సరఫరాలో కొంత ఆలస్యం మాత్రమే ఉంది.దిగుమతి భాగస్వామ్యాల వైవిధ్యీకరణ మనకు కొరత రాకుండా చేస్తోంది. గత 11 ఏళ్లలో భారత్ తన చమురు దిగుమతి భాగస్వామ్య దేశాల సంఖ్యను 27 నుంచి 41కి పెంచింది. రష్యా నుంచి ఏప్రిల్ నెల కోసం సుమారు 6 కోట్ల బ్యారెళ్ల చమురును ముందస్తుగా సమకూర్చుకోవడం దీనికి నిదర్శనం. హర్మూజ్ జలసంధి దాటి అనేక నౌకలు భారత్కు నిరంతరం చేరుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరిస్తూ, వ్యూహాత్మక చమురు నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది. గృహావసర ఎల్పీజీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తోంది. సీఎన్జీ పంపిణీలో కొంత ఆలస్యం ఉన్నా, అది సరఫరా గొలుసు సర్దుబాటు కారణంగానే తప్ప, కొరత వల్ల కాదు.
గల్ఫ్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నా, భారత్ మాత్రం దీర్ఘకాలిక ప్రణాళిక, వ్యూహాత్మక సిద్ధతతో ఈ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడింది. దేశాలతో ఇంధన భాగస్వామ్యాలు, వ్యూహాత్మక నిల్వలు, చాకచక్యమైన దౌత్యం అన్నీ కలిసి భారత్కు ఇంధన భద్రతను కల్పించాయి.