Andhra Pradesh Rajya Sabha Elections : ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రం నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్తవారు ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో కూటమికి ఏకపక్ష బలం ఉంది. అందుకే ఆ నాలుగు పదవి కూటమి దక్కించుకోనుంది. అయితే ఈసారి బిజెపికి ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే రాజ్యసభలో బిజెపికి తగినంత బలం కోసం.. గత రెండేళ్లలో రెండు పదవులను వదులుకొంది తెలుగుదేశం. ఈసారి మాత్రం జనసేనకు ఒక సీటు ఇచ్చి.. మిగతా మూడు పదవులను తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని చూస్తోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో బిజెపి సైతం గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రాజ్యసభ పదవి కోసం చంద్రబాబు పై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.
* మిత్రుడి రూపంలో ఒత్తిడి..
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల నుంచి 24 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఇందులో 11 పదవులను నేరుగా బిజెపి సొంతం చేసుకోనుంది. మిగతా ఎన్డీఏ పక్షాలు మరో ఆరు పదవులు సొంతం చేసుకుంటాయి. అయితే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో సైతం రాజ్యసభ పదవులు కోరుకుంటుంది బిజెపి. అందులో భాగంగా ఏపీ నుంచి ఒక పదవి కావాలని చంద్రబాబుపై ఒత్తిడి పెట్టే అవకాశం ఉంది. కానీ అది కూడా మిత్రుడి రూపంలోనే. ఏపీ నుంచి మాజీ ప్రధాని దేవే గౌడ కు అవకాశం కల్పించాలన్నది బిజెపి ఆలోచన. ఆయన కాకపోతే.. తమిళనాడు నేత అన్నామలైకు కానీ.. ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు కానీ ఛాన్స్ ఇవ్వాలని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* సదానంద గౌడ వైపు మొగ్గు
కర్ణాటక నుంచి బిజెపికి ఒక రాజ్యసభ పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అక్కడ మాజీ ప్రధాని దేవే గౌడ్ ఉన్నారు. ఆయన కుమారుడు ఎన్డీఏ లో భాగస్వామిగా ఉన్నారు. అందుకే ఈసారి ఎన్డీఏ తరఫున కర్ణాటక నుంచి అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. అయితే బిజెపి హై కమాండ్ మాత్రం సదానంద గౌడ వైపు మొగ్గు చూపుతోంది. అందుకే ఏపీ నుంచి చంద్రబాబును ఒప్పించే బాధ్యతను కేంద్రమంత్రి హెచ్డి కుమారస్వామిని అప్పగించింది. ఒకవేళ చంద్రబాబును ఒప్పిస్తే కర్ణాటక నుంచి దేవే గౌడ కు ఒప్పుకొని.. దాని బదులు ఏపీలో బిజెపి ఒకటి తీసుకుని.. అన్నమలైకు కానీ.. మందకృష్ణ మాదిగకు కానీ అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఎలాగైనా ఏపీ నుంచి ఒక పదవి కోరుకుంటుంది బిజెపి. మరి వారి ప్రయత్నాలు ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలి.
