Ayodhya Ram Temple controversy : వందల సంవత్సరాల కల నెరవేరింది. అయోధ్యలో రాముడికి ఆలయం నిర్మితమైంది. బాల రాముడిని ప్రతిష్టించిన తర్వాత అయోధ్యఖ్యాతి మరింత పెరిగిపోయింది. అయోధ్యకు ప్రతిరోజు వేలాదిమంది భక్తులు వెళ్తున్నారు. రాముడిని దర్శించుకుంటున్నారు. మొన్నటి వరకు అయోధ్య కేవలం భక్తుల తాకిడి.. రాముడికి సంబంధించిన పూజలు.. ఇతర వ్యవహారాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు అయోధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అయోధ్యకు సంబంధించిన వార్త ప్రతిరోజు అటు జాతీయ మీడియాలో.. ఇటు ప్రాంతీయ మీడియాలో ప్రధాన భాగం ఆక్రమిస్తుంది.
అయోధ్యలో శ్రీరాముడికి సంబంధించి చాలామంది భక్తులు కానుకలు.. విరాళాలు సమర్పించారు. అయితే ఇందులో హుండీ ఆదాయం దారి తప్పిందని.. దుర్వినియోగమైందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం రకరకాల కోణాలలో విచారణ నిర్వహిస్తోంది. దర్యాప్తును ముమ్మరం చేసిన నేపథ్యంలో సిట్ అధికారులు కీలక ఆదేశాలను జారీ చేశారు.
సిట్ అధికారులు ఇప్పటికే ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్న వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు అయోధ్య విడిచి వెళ్లకూడదని వారికి సూచించారు. అంతేకాదు, బ్యాంకు లావాదేవీలను.. ఇతర వ్యవహారాలను కూడా నిర్వహించవద్దని తేల్చి చెప్పారు. దీంతో ఏదో జరిగిందని.. అందువల్లే ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఇటువంటి ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది
ఇప్పటివరకు కేవలం హుండీ ఆదాయం మాత్రమే పక్కదారి పట్టిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. స్వామివారికి వచ్చిన కానుకలలో బంగారం.. వజ్రాలు.. వెండి.. వాటికి సంబంధించిన రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారని తెలుస్తోంది.. ఉచ్చ నగలను సక్రమంగా నమోదు చేయలేదని.. భద్రపరిచే విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు.
గత ఏడాది కుంభమేళా జరిగింది. అప్పుడు స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ నేపథ్యంలో వచ్చిన హుండీ సొమ్ముకు లెక్కా పత్రం లేకుండా పోయింది. ప్రతిరోజు దాదాపు 10 లక్షల మంది నాడు ఆలయాన్ని దర్శించుకున్నారు. గంటల వ్యవధిలోనే నోట్లతో హుండీలు నిండిపోయేవి.. అంతేకాదు వీటిపై సరైన పర్యవేక్షణ కూడా లేకుండా పోయింది. లెక్కలు కూడా నమోదు చేయలేదు. దీనికి తోడు 45 రోజుల సిసి ఫుటేజ్ మాత్రమే అందుబాటులో ఉండడం అధికారులకు సవాల్గా మారింది. ఫుటేజ్ డిలీట్ చేయడం.. తారుమారు చేయడం వంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో.. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఇంటి దొంగలను ఏ విధంగా బయట పెడతారో చూడాల్సి ఉంది.
