AP fishing ban 2026 : ఏపీ ప్రభుత్వం (AP government) కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. ఇందుకు సంబంధించి కసరత్తు చేస్తోంది. ఏటా సముద్రంలో వేసవిలో చేపల వేట నిషేధం. దాదాపు 61 రోజులపాటు ఈ నిషేధం కొనసాగనుంది. ఈరోజు రాత్రి నుంచి.. జూన్ 15 వరకు సముద్రంలో చేపల వేట నిషేధం. ఈ వేట నిషేధ సమయానికి గాను కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకం పేరుతో ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ ఏడాది పథకం అమలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. లబ్ధిదారుల ఎంపికపై తుది కసరత్తు జరుగుతోంది. రేపటి నుంచి వేట నిషేధం అమలు కానున్న దృష్ట్యా.. మత్స్యకారుల సేవలో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తోంది.
* సుదీర్ఘ సముద్ర తీరం..
రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. శ్రీకాకుళం జిల్లా డుంకూరు నుంచి తిరుపతి జిల్లా తడ వరకు దాదాపు ఈ కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. లక్షలాదిమంది మత్స్యకారులు చేపల వేటను నమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రత్యేక వేసవిలో చేపలు గుడ్లు పెడుతుంటాయి. ఇది సంతానోత్పత్తి సమయం కూడా. ఇటువంటి సమయంలో మర పడవలతో వేట సాగిస్తే చాపల ఉత్పత్తికి విఘాతం కలుగుతుంది. అందుకే ఏటా రెండు నెలలపాటు చేపల వేట నిషేధించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే నాటు పడవలకు మాత్రం అనుమతి ఉంటుంది. సముద్రంలో ఎనిమిది నాటికల్ మైళ్ల వరకు వేటకు అనుమతి ఉంటుంది. దీంతో దూరం వెళ్లి వేట చేయకూడదు. వేట నిషేధం అమల్లోకి రావడంతో చేపల ఉత్పత్తి తగ్గిపోతుంది. మత్స్యకారులకు సరైన ఉపాధి ఉండదు. అందుకే వేట నిషేధ సమయంలో ఉపాధిక గాను ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకంలో భాగంగా 20వేల రూపాయల చొప్పున సాయం అందిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
* సాయం పెంపు..
వైసిపి హయాంలో మత్స్యకార భరోసా పేరిట పథకాన్ని అమలు చేశారు. కానీ అప్పట్లో 10 వేల రూపాయల చొప్పున మాత్రమే అందించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సాయాన్ని 20 వేల రూపాయలకు పెంచారు. ఈనెల 17 నుంచి అర్హులైన మత్స్యకారుల వివరాలు సేకరించనున్నారు. మరోవైపు మత్స్యకారుల వేటకు సంబంధించి వినియోగించే బోట్లకు డీజిల్ పై సబ్సిడీ కూడా అందిస్తున్నారు. రాయితీపై మత్స్యకారులకు ఇంజన్, వల వంటివి అందిస్తున్నారు. 40 శాతం రాయితీపై అందజేస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు అందించే బీమా మొత్తాన్ని పెంచింది. గతంలో ప్రమాద బీమా రెండు లక్షల రూపాయల వరకు ఉండగా దానిని 10 లక్షలు చేసింది. ఇక మత్స్యకారుల సాధారణ మరణాలకు సంబంధించి బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం అందిస్తోంది. అయితే పారదర్శకంగా వేట నిషేధ భృతి అందించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
