YSRCP MLC Anantha Babu: అధికారం ఉందనుకున్నాడు.. ఏది చేసినా చెల్లుతుందని భావించాడు. తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడని తన డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తినే అంతమొందించాడు. తప్పించుకునేందుకు పడరాని పాట్లు పడ్డాడు. అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. కానీ చివరకు మార్గాలన్నీ మూసుకుపోవడంతో పోలీసులకు లొంగిపోయాడు. ఇదీ ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సారసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య మిస్టరీ. తన సొంత వ్యవహారాల్లో తలదూర్చినందుకే హత్య చేసినట్లు పోలీసులకు అనంతబాబు చెప్పినట్లు సమాచారం.
క్రైం బ్యాక్గ్రౌండ్..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అనంతబాబు గత ఎన్నికల సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను సైతం సృష్టించాడని సమాచారం. ఎస్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇలా చేశాడని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 2001లో కాంగ్రెస్ పార్టీ తరఫున అడ్డతీగల నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన అంనతబాబు ఎస్టీ సర్టిఫికెట్తో అడ్డతీగల మండల ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యాడని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.
తప్పుడు కుల ధ్రువీకరణ..
2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనంతబాబు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. ఎస్టీ నియోజకవర్గం అయిన రంపచోడవరం నుంచి బరిలో నిలవాలని భావించారు. అయితే కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో రెబల్గా నామినేషన్ దాఖలు చేశారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో రంపచోడవరం నుంచి ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు. అయితే ఎస్టీ కాకపోవడంతో ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. వెంటనే వంతల రాజేశ్వరి అనే మహిళతో నామినేషన్ వేయించాడు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ రాజేశ్వరి వైసీపీ తరపున గెలిచింది. కానీ ఆమె బదులు అనంతబాబే అధికారం చెలాయించాడు. చివరికి ఆమెకు వచ్చే జీతం కూడా అతనే తీసుకునేవాడనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read: Ego War Between YCP Leaders: వైసీపీ కీలక నేతల మధ్య ఇగో వార్..అసలు ట్విస్ట్ అదేనా?
తూర్పు ఏజెన్సీలో ఆయనదే హవా..
ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ రంపచోడవరం తూర్పు ఏజెన్సీలో అనంతబాబు హవానే కొనసాగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి కూడా పేరుకే ఎమ్మెల్యే. అధికారాలు మొత్తం అనంతబాబు చేతిలో ఉంటాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయనకు వైసీపీ తరఫున కాపు కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు.
కొత్తపల్లి గీతపై దాడి చేసి జైలుకు..
కొత్తపల్లి గీత అరకు ఎంపీగా ఉన్న సమయంలో ఆమెపై అనంతబాబు దాడికి ప్రయ్నత్నించాడు. ఈ విషయంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. గంజాయి రవాణా వంటి చట్ట వ్యతిరేక వ్యవహారాల్లోనూ ఎమ్మెల్సీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుందని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా అక్రమ వ్యాపార రహస్యాలు తెలిసిన తన మాజీ డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేరాలన్నీ వెలుగులోకి వచ్చినవే అని.. అనంతబాబు అరాచకాలు బయటకు రానివి ఎన్నో ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హత్యానేరాన్ని అంగీకరించిన అనంతబాబును ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఏం చేస్తుందో వేచి చూడాలి.
Recommende Videos: