Congress in AP: ఏపీలో కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం.. వర్కవుట్ అవుతుందా?

వాస్తవానికి కాంగ్రెస్ కు ఏపీలో కనీస ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణమని సాకుగా చూపుతూ చాలామంది నాయకులు ఆ పార్టీని వీడారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే వారికి అభిమానం చావలేదు.

Written By: Dharma, Updated On : November 27, 2023 3:57 pm
Follow us on

Congress in AP: ఏపీలో కాంగ్రెస్ పునరాగమనానికి ప్రయత్నాలు ప్రారంభించింది.మరుగున పడిపోయిన ప్రత్యేక హోదా గళం ఎత్తుకుంది. విశాఖ స్టీల్ ఉద్యమంలో బలమైన వాయిస్ ను వినిపించాలని నిర్ణయానికి వచ్చింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభమైంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చిన మరుక్షణం.. ఏపీలో ప్రత్యేక హోదా తో పాటు విశాఖ స్టీల్ ఉద్యమాన్ని పతాకస్థాయిలోకి తీసుకెళ్లాలి అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఏపీలో వైసీపీకి నష్టం తప్పదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

వాస్తవానికి కాంగ్రెస్ కు ఏపీలో కనీస ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణమని సాకుగా చూపుతూ చాలామంది నాయకులు ఆ పార్టీని వీడారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే వారికి అభిమానం చావలేదు. ప్రాంతీయ పార్టీల్లో అయిష్టంగానే కొనసాగుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏపీలో యాక్టివ్ అయితే అటువంటి నాయకులు రీ బ్యాక్ అవడం ఖాయం. వైసీపీలో ఉన్న నాయకుల్లో 90 శాతం కాంగ్రెస్ భావజాలం ఉన్నవారే. కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన వారే. అటువంటి వారంతా తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ విషయంలో ఒక ప్రణాళిక బద్దంగా వెళుతున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎదిగిపోయే పొజిషన్ ఏపీలో లేదు. కానీ 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ మాత్రం యాక్టివ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఏపీకి ప్రత్యేక హోదా తో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను పర్యవేక్షిస్తామని భావి ప్రధానిగా భావిస్తున్న రాహుల్ గాంధీ ప్రకటన చేయడం విశేషం. ఇక్కడ ఒక్క విషయం మాత్రం ప్రస్తావించాలి. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కానీ.. వస్తే మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించలేదు. కేంద్రంలో అధికారంలోకి వస్తే చాలు ఏపీకి ప్రత్యేక వరాలు ప్రకటిస్తామని మాత్రం చెబుతుండడం ప్రస్తావించాల్సిన విషయం.

ప్రత్యేక హోదా తో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అధికారంలో ఉన్న వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన నేరుగా కేంద్రం ప్రభుత్వం పై విమర్శలు చేయడం లేదు. తమకు తామే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వంపై బలంగా మాట్లాడుతున్నది మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులే. అతి తక్కువ మంది ఉన్నా తమ వాయిస్ ను వినిపించ గలుగుతున్నారు.ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏపీ నుంచి మాట్లాడే కాంగ్రెస్ నాయకుల సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు సైతం పెరుగుతాయి. అందుకే సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు లాంటి నాయకులు యాక్టివ్ కావడం అందులో భాగమే నన్న విశ్లేషణలు వెలవడుతున్నాయి.