
చైనా పాలకులు దేశాన్ని యుద్ధోన్మాదంలోకి ఉసిగొలుపుతూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారనే విమర్శలు తెచ్చుకుంటున్నారు. 1962కు ముందు కూడా చైనాలో భారీ ఆహార సంక్షోభం తలెత్తింది. అప్పుడు నాటి చైనా పాలకుడు మావో జెడాంగ్.. ప్రజల్లో తన వైఫల్యం కనపడకుండా.. ప్రజల దృష్టిని మరల్చాలని 1962లో భారత్ తో కయ్యానికి కాలుదువ్వి.. యుద్ధంలో భారత్ ను ఓడించి జాతీయ కాంక్షను రగిల్చి ఆ వ్యతిరేకతను రానీయకుండా పోగొట్టుకున్నాడు. కానీ అప్పటికే చైనాలో ఆహార కొరతతో కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఇప్పుడు చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ కూడా అదే చేస్తున్నాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విస్తరణ వాదంతో చెలరేగిపోతున్న చైనాకు సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చైనా ప్రస్తుతం 140 కోట్లకుపైగా జనాభాకు ఆహారాన్ని అందించలేక ఆహార సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఈ మేరకు స్వయంగా అధ్యక్షుడు జిన్ పింగ్ వెల్లడించడం సంచలనమైంది.
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మాట్లాడుతూ.. ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. ఆహార వృథా విపరీతంగా ఉందని.. ప్రజల్లో అవగాహన కల్పించి అరికట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలోనే దేశంలోని అన్ని మీడియాల్లో ఆహార వృథాను అరికట్టాలని పెద్ద ఎత్తున ప్రచారకార్యక్రమాలు కొనసాగాయి. 2015లో చైనాలోని మహానగరాల్లో 17 నుంచి 18 టన్నుల ఆహారాన్ని వృథా చేసినట్లు గణాంకాలను మీడియాలో చూపించారు. ఇది దక్షిణ కొరియా ఆహార అవసరాలకు సరిపోతుందని తేల్చారు.
చైనా ఆహార అవసరాలు 30శాతం దిగుమతులే తీరుస్తాయి. వాణిజ్య యుద్ధంతో అమెరికా నుంచి వచ్చే ఆహార దిగుమతులు నిలిచిపోయాయి. భారత్, వియత్నాంలు కరోనా కారణంగా వరి ఎగుమతులు నిషేధించాయి. చైనాలో యాంగ్జీ కారణంగా వరదలు వచ్చి వరి ఉత్పత్తి నష్టపోయారు.
అయితే ఆహార సంక్షోభాన్ని జిన్ పింగ్ దాచేసి లఢక్, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు సృష్టిస్తూ ప్రజల దృష్టిని మరలుస్తున్నాడని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.