
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు విచారణ పూర్తి చేశారు. గ్యాంగ్ లీడర్ పండుతో సహా 13 మంది స్ట్రీట్ ఫైటర్స్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు సంఘటన వివరాలు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామని త్వరలోనే మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని వెల్లడించారు. పండు గ్యాంగ్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన సందీప్ చనిపోయాడని, గతంలో పండు, సందీప్ మంచి స్నేహితులని చెప్పారు. ల్యాండ్ సెటిల్మెంట్లోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, యనమలకుదురు స్థల వివాదంలో పండు, సందీప్ల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఈ గ్యాంగ్ వార్ చోటు చేసుకుందన్నారు. ప్రదీప్రెడ్డి, శ్రీధర్రెడ్డిల మధ్య అపార్ట్మెంట్ నిర్మాణంలో వివాదం తలెత్తిందని, శ్రీధర్రెడ్డి నుంచి రావాల్సిన వాటా కోసం ప్రదీప్రెడ్డి నాగబాబును ఆశ్రయించాడన్నారు. వివాదం పరిష్కారం కోసం గత నెల 29న సందీప్, పండును పిలిపించారని తెలిపారు.
నాగబాబు, సందీప్లు ఉండగా పండు రావడం ఇరువురికి నచ్చలేదని, దీంతో పండుకు వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయించుకుని సందీప్ ఫోన్లో బెదిరించే యత్నం చేశాడన్నారు. సెటిల్మెంట్కు నువ్వు ఎందుకొచ్చావంటూ నిలదీయడం, 29న అర్థరాత్రి పండు ఇంటికెళ్లి సందీప్ బెదిరించడం జరిగిందన్నారు. ఆ తర్వాత 30న ఉదయం పండు అనుచరులు సందీప్ షాపుకు వెళ్లి, షాపులో ఉన్న సందీప్ అనుచరుడిని పండు గ్యాంగ్ కొట్టిందన్నారు. అనంతరం మాట్లాడుకుందాం అని పిలుచుకుని 31వ తేదీ సాయంత్రం ఇరువర్గాలు కొట్టుకున్నాయని, పోలీసులు వెళ్లేసరికి చాలా మంది గాయపడి ఉన్నారని చెప్పారు. నిందితుల కోసం 6 బృందాలుగా ఏర్పడి గాలించినట్లు, గ్యాంగ్ వార్లో వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విజయవాడలో ఘర్షణ వాతావరణానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.